చెన్నై: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్బక్కమ్లోగల హడ్డోస్ రోడ్డులో అమె నివసిస్తున్నారు. ఆమె తన ఇంట్లోనే జారిపడి చనిపోయినట్లు తెలుస్తున్నది. ఇంట్లో విగత జీవిగా పడి ఉన్న వాణిని స్థానికుల సహాయంతో పనిమనిషి ఆస్పత్రికి తరలిస్తుండగా లో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె ఆలపించారు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన వాణీజయరాం భారతదేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా గొప్ప నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఉత్తమ నేపథ్య గాయని విభాగంలో మూడుసార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. అంతేగాక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాలు కూడా ఆమెను అవార్డులతో సత్కరించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా వాణీ జయరాంకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.
తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న వాణీ జయరాం జన్మించారు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఐదో సంతానమై ఆమె 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు.
మృతిపై అనుమానాలు?
వాణి జయరాం మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉండటంతో ఆమెది సహజ మరణమేనా లేక ఏమైనా కుట్ర జరిగిందా..? అని పలువురు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వాణి జయరాం ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన మహిళ ఫ్లాట్ తలుపుతట్టగా లోపలి నుంచి స్పందన లేదు. ఆమె ఐదుసార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయలేదు.
దాంతో పనిమనిషి భర్త తన ఫోన్లోంచి వాణీ జయరాం ఫోన్కు కాల్ చేశాడు. అయినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో అనుమానం వచ్చిన పనిమనిషి పోలీసులకు ఫోన్ చేసి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టించింది. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాణీ జయరాం స్పృహ లేకుండా కింద పడిపోయి ఉన్నారు. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్టుగా తీవ్ర గాయాలున్నాయి.
వెంటనే పనిమనిషి, స్థానికులు కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మరణించినట్లుగా నిర్ధారించారు. పనిమనిషి, స్థానికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్లాట్ను ఆధీనంలోకి తీసుకుని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఫ్లాట్లోని సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.