Tirumala Tirupathi | ఆదివారం వీకెండ్ కావడంతో కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు పలువురు సినీ, క్రీడ ప్రముఖులు తరలివచ్చారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి ఆయన భార్య నిక్కీ గల్రాని ప్రత్యేకంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి చేరుకున్న వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు సాదరంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరంతా గర్భగుడిలో కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
మరోవైపు, భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, కోచ్ గౌతం గంభీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామున జరిగిన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అలాగే, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ మరియు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా వేర్వేరుగా తిరుమలకు చేరుకుని శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రముఖుల రాకతో తిరుమలలో సందడి వాతావరణం నెలకొంది.