Indian 2 | ‘ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను.. భారతీయుడుకి చావేలేదు.. ’.. సేనాపతి పాత్రలో ఉన్న కమల్హాసన్ ఈ డైలాగ్ చెప్పడంతో ‘భారతీయుడు’ సినిమా ముగుస్తుంది. సీక్వెల్ రావొచ్చు అన్న బీజాన్ని ప్రేక్షకుల మనసుల్లో ఆనాడే నాటేశాడు దర్శకుడు శంకర్. అనుకున్నట్టే ‘భారతీయుడు 2’ మొదలైంది. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతున్నది. శుక్రవారం ‘భారతీయుడు 2’లోని సేనాపతి పాత్రను ఓ వీడియో ద్వారా పరిచయం చేశారు మేకర్స్.
ఈ వీడియోలో పెట్రేగిపోతున్న లంచగొండితనాన్ని, ప్రబలమవుతున్న పేదరికాన్ని, అంతకంతకూ ఎదిగిపోతున్న ధనికవర్గాలను కళ్లకు కట్టాడు దర్శకుడు శంకర్. 1996 నుంచి 2023వరకూ టెక్నాలజీతోపాటు పెరుగుతున్న అవినీతిని చూపించాడు. 27ఏళ్ల క్రితం దేశం వదిలి వెళ్లిపోయిన సేనాపతి మళ్లీ రావాలని కోరుకుంటూ.. ‘కం బ్యాక్ ఇండియన్’ అంటూ దేశం మొత్తం ముక్తకంఠంతో సేనాపతిని పిలుస్తున్నట్టు వీడియోలో చూపించాడు.
సేనాపతి రావాలని కాశీలో జనం పూజలు చేస్తున్నారు. ఎట్టకేలకు జనం కోరిక ఫలించింది. సేనాపతి వచ్చాడు. ‘నమస్తే ఇండియా.. భారతీయుడు ఈజ్ బ్యాక్..’ అనడంతో వీడియో ముగిసింది. మొత్తానికి వీడియోని బట్టి చూస్తే, అవినీతి, లంచగొండి తనంపైనే ఈ సీక్వెల్ సాగినట్టు అర్థమవుతున్నది. మరి ‘భారతీయుడు’లోని ఎమోషన్స్, దేశభక్తి, అత్యద్భుతమైన సంగీతం ఇందులో ఉన్నాయా? అనేది తెలియాల్సివుంది.
‘భారతీయుడు’లో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ నడిముడి వేణు ఇందులోనూ కీలకపాత్ర పోషించారు. హీరో సిద్దార్థ్ కథలో కీ రోల్ చేసినట్టు, కథానాయికలు రకుల్ప్రీత్సింగ్, ప్రియ భవానీ శంకర్ ఎమోషనల్ పాత్రలు పోషించినట్టు వీడియో ద్వారా తెలుస్తున్నది. ఇంకా బ్రహ్మానందం, ఎస్.జె.సూర్య, సముద్రఖని, బాబీ సింహా తదితరులు వీడియోలో తళుక్కున మెరిశారు. అనిరుథ్ సంగీతం ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.