అగ్ర కథానాయిక విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘దో ఔర్ దో ప్యార్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మూఢనమ్మకాల గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడిచేసింది. ‘ఓ దర్శకుడున్నాడు. తనకు మూఢనమ్మకాలెక్కువ. దాంతో లొకేషన్లో వింతగా ప్రవర్తించేవాడు. 42రోజులు ఒకే షర్ట్ ధరిస్తే సినిమా హిట్ అవుతుందని తనకు ఎవరో చెప్పారట. దాంతో లొకేషన్లో ఒకే షర్ట్తో ఉండేవాడు.
ముందు నేను పెద్దగా పట్టించుకోలేదు. వేరేవాళ్ల ద్వారా తెలుసుకుని షాక్ అయ్యాను. తీరా ఆ సినిమా అట్టర్ఫ్లాప్. దయచేసి ఆ దర్శకుడెవరని అడగొద్దు. నేను చెప్పను’ అంటూ అందంగా నవ్వేసింది విద్యాబాలన్. తనను బాధపెట్టిన ఓ నిర్మాతను కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు విద్యాబాలన్. ‘నన్ను ఓ నిర్మాత తన సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. షూట్ మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తొలగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వాకబు చేస్తే.. నా జాతకం మంచిది కాదని, నేను నష్టజాతకురాలినని, అందుకే ప్రాజెక్ట్ నుంచి తొలగించామని ఆయన మీడియాతో చెప్పారట. నిజంగా చాలా బాధ అనిపించింది’ అంటూ జ్ఞాపకాలను నెమరువేసుకుంది విద్యాబాలన్.