‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని చూసి చాలా మంది స్టార్ హీరోలు అభినందించారు. చిరంజీవిగారు రెండు గంటల పాటు సినిమా గురించి మాట్లాడారు. నా పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే హ్యాపీగా అనిపించింది’ అన్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన అనుష్కతో జోడీగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విజయాన్ని పురస్కరించుకొని నవీన్ పొలిశెట్టి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ ఇప్పటివరకు నాకు దక్కిన మూడు సక్సెస్ఫుల్ సినిమాల్లో ఇదొకటి.
ఈ సినిమా ద్వారా నేను కేవలం కామెడీనే కాదు ఎమోషన్స్ కూడా బాగా పండించగలనని నిరూపించుకున్నా. ఈ సినిమాలో స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తెలుగువాళ్లకు కొత్తగా అనిపిస్తున్నది. నా కెరీర్లో బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదే అంటున్నారు. నేను అన్ని జోనర్స్ను ఇష్టపడతా. తెలుగులో భైరవ ద్వీపం, ఆదిత్య 369 నా ఫేవరేట్ మూవీస్. ఈ సినిమా సక్సెస్తో నాపై మరింత బాధ్యత పెరిగిందనుకుంటున్నా. హిందీలో కొన్ని కథలు విన్నా. అయితే ప్రస్తుతం నా ప్రయారిటీ తెలుగు సినిమాలకే’ అన్నారు.