Kashmir files | వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించి నిర్మించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’పై మరోసారి వివాదం మొదలైంది. తొమ్మిది నెలల క్రితం థియేటర్లలో విడుదలై ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా వాస్తవానికి కశ్మీరీ పండిట్ల మారణహోమాన్ని బట్టబయలు చేసిందని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్ అన్నారు. ఈ చిత్రాన్ని వల్గర్ ప్రాపగండా అని ఆయన అభివర్ణించారు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే సినిమా మేకర్స్కి అనుకూలంగా, వ్యతిరేకంగా అనేక మంది సోషల్ మీడియాలో వాదనలు వినిపించారు.
యూదుల మారణహోమం నిజమైతే.. : అనుపమ్ ఖేర్
ఇఫీ జ్యూరీ హెడ్గా వ్యవహరించిన ఇజ్రాయెల్ చిత్రనిర్మాత నాదవ్ లాపిడ్ ప్రకటనను ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్రంగా ఖండించారు. ‘అబద్దం ఎంత ఎత్తులో ఉన్నా.. నిజంతో పోలిస్తే అది చిన్నదే..’ అని సోషల్ మీడియాలో తన ప్రకటనను షేర్ చేశారు. ఇదే సమయంలో మరో వార్తసంస్థతో మాట్లాడిన ఆయన.. యూదుల మారణహోమం నిజమే అయితే.. కశ్మీరీ పండ్లి వలసలు కూడా నిజమే అని చెప్పారు. టూల్కిట్ గ్యాంగ్ యాక్టీవ్గా మారిన వెంటనే ఈ వాదనలు తెరపైకి వచ్చాయని, ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తున్నదన్నారు. ఇఫీ జ్యూరీ హెడ్గా ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. వేలు, లక్షల మంది ప్రజల విషాదాన్ని తన ఎంజెండాను నెరవేర్చుకోవడం కోసం ఉపయోగించకుండా దేవుడు ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని చెప్పారు.
ఆ ప్రకటన ఆయన వ్యక్తిగతం: జ్యూరీ బోర్డ్
ఇలాఉండగా, జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని 53 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) జ్యూరీ బోర్డు నిర్ణయించింది. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని బోర్డు తరఫున మరో ప్రకటన వెలువరిస్తూ జ్యూరీ సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు. జ్యూరీ బోర్డు ఎప్పుడూ తన ఇష్టాలు, అయిష్టాల గురించి అధికారికంగా వెల్లడించదని పేర్కొన్నారు.
జ్యూరీ హెడ్ ప్రకటన సరైందే: స్వర భాస్కర్
ఇదే సమయంలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఇఫీ జ్యూరీ హెడ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. ఆయనకు అనుకూలంగా స్వర భాస్కర్ ట్విట్టర్లో తన కామెంట్స్ పోస్ట్ చేశారు. ‘సహజంగానే ఇది ప్రపంచానికి చాలా స్పష్టం ఉన్నది..’ అని రాశారు.
కళ్లలో నీళ్లొచ్చాయి: ఇజ్రాయెల్ కౌన్సిల్ జనరల్
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తమ దేశానికి చెందిన చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్ చేసిన ప్రకటనపై ఇజ్రాయెల్ కౌన్సిల్ జనరల్ కోబ్బి శోషని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యూరీ హెడ్ నాదవ్ స్టేట్మెంట్ పూర్తిగా తప్పు అని చెప్తూ.. ‘సినిమా చూడగానే నా కళ్లలో నీళ్లు రావడం మొదలయ్యాయి. ఈ సినిమాను చూడటం అంత తేలికైంది కాదు. ఈ సినిమాను ఇజ్రాయెల్లో కూడా ప్రదర్శించారు. భయంకరమైన విషయాలను అనుభవించిన యూదులు, ఇతరుల బాధలను అర్థం చేసుకోవాలని నేను భావిస్తున్నాను..’ వెల్లడించారు.