Tollywood Remake Movies | ‘వచ్చిన సినిమా కథలు తీసుకొని.. రాబోయే సినిమాలకు కథలు రాస్తుంటాను’ ఈ డైలాగ్ శుభాకాంక్షలు చిత్రంలోది. కామెడీగా అన్నా.. సినీ ఇండస్ట్రీలో అది రెగ్యులర్ ఫార్ములానే! కానీ, గతంలో వచ్చిన సినిమాలు అచ్చంగా అలాగే మళ్లీ ప్రాణం పోసుకోవడమే కొత్త వింత! వీటిలో కొన్ని అప్పట్లో రీమేక్ అయినవీ ఉన్నాయి. కాలానుగుణంగా కథనాలు మార్చుకున్నవీ ఉన్నాయి. ఏదైతేనేం ఆ పాత మధురాలు నూతనత్వాన్ని సంతరించుకొని ప్రేక్షకులను అలరించాయి. తాజాగా చిరంజీవి నటిస్తున్న ‘బోళా శంకర్’ కూడా రీమేక్ మూవీకి ఎక్కువ, రిపీట్ సినిమాకు తక్కువ అనిపించుకుంటున్నది. 2015లో వచ్చిన తమిళ సినిమా ‘వేదాళం’ ఈ చిత్రానికి మాతృక. అయితే ఓటీటీలో, యూ ట్యూబ్ ద్వారా ‘వేదాళం’ మనకూ దగ్గరైంది. ఆ కారణంగా ‘బోళా శంకర్’ వన్స్మోర్ అంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నది. ఇంతకుముందు తెలుగు తెరపై ఇలా రిపీటెడ్గా వచ్చి రికార్డులు సృష్టించిన చిత్రాల సంగతులు ఇవి..
దేవదాసు మళ్లీ పుట్టాడు
తొలితరం దర్శక దిగ్గజం వేదాంతం రాఘవయ్య దత్త పుత్రుడు ‘దేవదాసు’. బెంగాలీ రచయిత శరత్చంద్ర నవల ‘దేవదాసు’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అప్పటికే బెంగాలీ, హిందీ భాషల్లో పలుమార్లు విడుదలైంది. అయితే మూలకథలో పెద్దగా మార్పులు లేకుండా అచ్చంగా తెలుగు నేటివిటీతో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా 1953లో విడుదలైన ‘దేవదాసు’ ఓ సంచలనం. ఎస్వీఆర్, సీఎస్సార్, సావిత్రి వంటి హేమాహేమీలు మన ‘దేవదాసు’ను వెండితెర వజ్రపు తునకగా మలిచారు. సీఆర్ సుబ్బరామన్ సంగీతంలో ఓలలాడిన సముద్రాల సీనియర్ సాహిత్యం నేటికీ ప్రేక్షకుల హృదయాల్లో ఉప్పొంగుతూనే ఉంది. ఈ చిత్రం విడుదలైన 21 ఏండ్లకు 1974లో కృష్ణ హీరోగా ‘దేవదాసు’ మరోసారి తెలుగువారిని పలకరించాడు. విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాత దేవదాసు అభిమానులకు రుచించలేదు. ఫ్లాప్టాక్ తెచ్చుకున్న కొత్త ‘దేవదాసు’ కృష్ణ కెరీర్లో ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోయింది.
నర్తనశాలలో విరాటపర్వం
టాలీవుడ్ చరిత్రలో చిత్రరాజాలుగా పేర్కొనే వాటిలో ఒకటి 1963లో వచ్చిన ‘నర్తనశాల’. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు! బృహన్నలగా ఎన్టీఆర్, కీచకుడిగా ఎస్వీఆర్, ఉత్తర కుమారుడిగా రేలంగి నటన ‘నర్తనశాల’ను ఆపాత మధురంగా నిలిపింది. అంతేకాదు ఎస్వీఆర్ జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ‘సలలిత రాగ సుధారస సారం..’,
‘జననీ శివకామిని..’, ‘ఎవరి కోసం ఈ మందహాసం..’, ‘నరవరా ఓ కురువరా..’, ‘సఖియా వివరించవే..’, ‘దరికి రాబోకు రాబోకు రాజా..’ తదితర గీతాలు ఎవర్గ్రీన్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాయి. ఈ చిత్రం విడుదలైన పదహారేండ్లకు ఇదే కథతో ‘శ్రీమద్విరాటపర్వం’ నిర్మించాడు ఎన్టీఆర్. దర్శకత్వ బాధ్యతలతో పాటు కృష్ణుడు, కీచకుడు, దుర్యోధనుడు, అర్జునుడు, బృహన్నలగా ఐదు పాత్రలు పోషించి ఎన్టీఆర్ రికార్డు సృష్టించాడు. సినిమా జయాపజయాల సంగతి అటుంచితే ఎన్టీఆర్ టేకింగ్కు మంచి మార్కులు పడ్డాయి.
‘పక్కింటి అమ్మాయి’లు ఇద్దరు
ఒకే టైటిల్, ఒకే కథతో తెలుగువారిని పలకరించిన చిత్రం ‘పక్కింటి అమ్మాయి’. 1953లో సి.పుల్లయ్య దర్శకత్వంలో రేలంగి, అంజలీదేవి, నేపథ్య గాయకుడు ఏఎమ్ రాజా ప్రధాన తారాగణంగా ఈ సినిమా విడుదలైంది. 1952లో రిలీజైన బెంగాలీ చిత్రం ‘పెషర్ బరీ’ దీనికి మాతృక. రేలంగి ‘పక్కింటి అమ్మాయి’ అప్పట్లో పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. మళ్లీ 1981లో కె.వాసు దర్శకత్వంలో జయసుధ ‘పక్కింటి అమ్మాయి’గా మరోసారి పలకరించింది. ఆమెకు జోడీగా చంద్రమోహన్ నటించాడు. నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. సంగీత పరంగానూ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.‘పక్కింటి అమ్మాయి.. పరువాల పాపాయి..’, ‘చిలకా పలుకవే.. ఆ కిటికీ తెరువవే..’ వంటి పాటలను ఆల్ ఇండియా రేడియోలో ఇప్పటికీ శ్రోతలు కోరుతుంటారు. 1968లో సునీల్దత్, సైరా బాను, కిషోర్ కుమార్, మెహమూద్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ‘పడోసన్’ కథ కూడా ఇదే!
తెలుగు డాన్స్
అమితాబ్ను బాలీవుడ్ బిగ్ బీగా నిలబెట్టిన సినిమాల్లో ఒకటి ‘డాన్’. 1978లో విడుదలైన ఈ సినిమా ఓ సంచలనం. దీనికి రీమేక్గా 1979లో తెలుగులో ‘యుగంధర్’ చిత్రం విడుదలైంది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించాడు. తర్వాత 30 ఏండ్లకు 2009లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బిల్లా’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదే సమయంలో బాలీవుడ్ పాత ‘డాన్’ సినిమా కథతో షారుఖ్ ఖాన్ హీరోగా ‘డాన్’, దీనికి సీక్వెల్గా ‘డాన్-2’ ప్రేక్షకులను మెప్పించాయి.
రెండు పుష్కరాల తర్వాత..
దర్శకుడు కె.వాసు, హీరో చంద్రమోహన్ కాంబోలో 1980లో వచ్చిన మంచి చిత్రం ‘గోపాలరావు గారి అమ్మాయి’. రావు గోపాలరావు, నాగభూషణం, జయసుధ, షావుకారు జానకి కీలక పాత్రలు పోషించారు. పాటలు కూడా పసందుగా ఉండటంతో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. రెండు పుష్కరాల తర్వాత దాదాపు ఇదే కథతో 2004లో అదే కె.వాసు దర్శకత్వంలో ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’ చిత్రం విడుదలైంది. శ్రీకాంత్, ప్రభుదేవ,
ఆర్తి చాబ్రియా, ప్రకాశ్రాజ్ ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లు సాధించింది.
బాలీవుడ్లో నయా ట్రెండ్
బాలీవుడ్లో రిపీట్ మూవీ ట్రెండ్ ఎప్పట్నుంచో ఉన్నదే! దేవదాసు మొదలుకొని షోలే వరకు ఎన్నో సినిమాలు మళ్లీమళ్లీ ప్రేక్షకులను పలకరించాయి. 1970 ప్రాంతంలో బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అమితాబ్ హీరోగా నటించిన మిలీ, రాజేష్ఖన్నా హీరోగా వచ్చిన బావర్చి, సంజీవ్కుమార్ నటించిన కోశిష్ సినిమాలు ప్రస్తుతం పునర్నిర్మాణ దశలో ఉన్నాయి. ఎన్సీ సిప్పీ బ్యానర్పై వచ్చిన ఈ సినిమాలను జాదూగర్, సమీర్రాజ్ సిప్పీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విభిన్న కథాంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలను ఈ తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీటిని మళ్లీ నిర్మిస్తున్నట్టు చెబుతున్నారు నవీన నిర్మాతలు.