‘ఈ మధ్యకాలంలో ఎక్కువగా తండ్రి పాత్రలే చేశాను. కానీ ఈ సినిమాలో పూర్తి విభిన్నమైన పాత్ర దక్కింది. కథాగమనంలో నేను కీలకంగా ఉంటాను’ అన్నారు సీనియర్ నటుడు తనికెళ్ల భరణి. ‘పెదకాపు-1’ చిత్రంలో ఆయన ముఖ్య పాత్రను పోషించారు. విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి శనివారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
ఈ సినిమాలో సమాజంపై విసిగిపోయి ఫ్రస్ట్రేషన్తో కనిపించే స్కూల్ టీచర్ పాత్ర నాది. దర్శకుడి ఆలోచనలను ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల తరపున సమాజాన్ని ప్రశ్నిస్తుంది. నా క్యారెక్టర్ నిడివి కూడా ఎక్కువే ఉంటుంది. ఈ మధ్యకాలంలో చేసిన ఉత్తమైన పాత్ర ఇదే అనుకుంటున్నా. నా కెరీర్లో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిత్రాల్లో తెలుగుదనం, గోదావరి యాస ఉట్టిపడుతుంది. సాధారణంగా దర్శకుడి ప్రాంతీయ సంస్కృతి సినిమాల్లో కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో అందుకు భిన్నంగా కొంచె వయొలెన్స్ కూడా కనిపిస్తుంది.
హీరో విరాట్ కర్ణ కొత్తవాడైనా చక్కటి నటన కనబరిచాడు. అతనిలో ఏదో సాధించాలనే తపన ఉంది. భవిష్యత్తులో మంచి హీరోగా ఎదుగుతాడు. ఇక నా కెరీర్లో మాతృదేవోభవ, లేడీస్ టైలర్, కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, శివ, అతడు, మన్మథుడు, గద్దలకొండ గణేష్ వంటి సినిమాల్లో చేసిన పాత్రలు బాగా గుర్తుండిపోయాయి. నలభై ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అనేక రకాల పాత్రలు చేశాను. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా చేయాలనే కోరిక మాత్రం మిగిలిపోయింది. ప్రస్తుతం తెలుగులో కొత్త దర్శకుడు శేఖర్తో ఓ సినిమా చేస్తున్నా. కన్నడలో శివరాజ్కుమార్ చిత్రంలో నటిస్తున్నా.