“అఖండ’ చిత్రంలో నేను శ్రావణ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను పోషించా. కథాగమనంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది. నటిగా నన్ను కొత్తకోణంలో ఆవిష్కరించే చిత్రమిది’ అని చెప్పింది ప్రగ్యాజైస్వాల్. ఆమె బాలకృష్ణ సరసన కథానాయికగా నటించిన చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకుడు. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మాత. డిసెంబర్ 2న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రగ్యాజైస్వాల్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘దర్శకుడు బోయపాటి శ్రీను ప్రతిభ మీద నాకు అపారమైన నమ్మకం. అందుకే ‘అఖండ’ కథ మొత్తం వినకుండానే అంగీకరించా. బాలకృష్ణలాంటి పాజిటివ్ దృక్పథం ఉన్న వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు. క్రమశిక్షణ, సమయపాలన విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది. బాలకృష్ణతో పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకున్నా. ఈ సినిమాలో నా పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. నాకు ఎదురైన సంఘటనల వల్ల రెండో పాత్ర అయిన ‘అఖండ’ ఎంట్రీ ఉంటుంది. అభినయానికి గొప్ప ఆస్కారం ఉన్న పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం నా కెరీర్ పట్ల సంతృప్తిగా ఉన్నా’ అని చెప్పింది.