తమిళ అగ్రహీరో ధనుష్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో విదేశాల నుంచి ధనుష్ దిగుమతి చేసుకున్న ఖరీదైన రోల్స్రాయిస్ కారుకు సంబంధించిన పన్ను తప్పకుండా కట్టాల్సిందేనని తీర్పునిచ్చింది. కారుకు పన్ను కట్టే విషయంలో తనకు మినహాయింపునివ్వాలని ధనుష్ 2015లో మద్రాస్ కోర్టులో పిటిషన్ వేశారు. గురువారం దీనిపై పరిశీలన జరిపిన కోర్టు ఆయన్ని తీవ్రస్వరంతో మందలించింది. ‘ ప్రజలు చెల్లించిన పన్నులతో వేసిన రోడ్డుపై మీరు లగ్జరీ కారు నడుపుతున్నారు. అలాంటప్పుడు దిగుమతి సుంకాన్ని చెల్లించడానికి అభ్యంతరం ఏమిటి? దినసరి కూలీలు మొదలుకొని పాలు అమ్ముకునే వర్తకులు సైతం ప్రతి లీటరు పెట్రోలుకు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నారు. సెలబ్రిటీగా చెలామణి అవుతూ పన్ను మినహాయింపు కోరడం ఏమాత్రం బాగోలేదు. నా వృత్తిజీవితంలో ఇలాంటి కేసును చూడలేదు’ అని జస్టిస్ సుబ్రహ్మణియన్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే తాను సగం పన్ను చెల్లించానని, మిగతా మొత్తం కట్టడానికి కొంత సమయం కావాలని ధనుష్ కోరగా ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇరవై నాలుగు గంటలలోగా ధనుష్ నుంచి పన్ను వసూలు చేయాలని కమర్షియల్ టాక్స్ విభాగాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నెలక్రితం తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ కూడా కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. పన్ను ఎగవేత కేసులో ఆయనకు మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. అగ్ర కథానాయకులిద్దరు పన్ను ఎగవేత కేసులో హైకోర్టు మందలింపునకు గురికావడం తమిళ సినీ పరిశ్రమకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.