అగ్ర కథానాయిక రష్మిక మందన్న త్వరలో విక్రమ్తో జోడీగా ఓ తమిళ సినిమాలో నటించనుందని తెలిసింది. తెలుగు, హిందీ భాషల్లో భారీ అవకాశాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇటీవలకాలంలో తమిళ సినిమాలకు కాస్త బ్రేక్నిచ్చింది. తాజాగా తమిళంలో ఓ మల్టీస్టారర్ చిత్రానికి అంగీకరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన ‘2018’ చిత్రంతో దక్షిణాది పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు మలయాళీ దర్శకుడు జాడ్ ఆంథోని జోసెఫ్.
ఆయన తన తర్వాతి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్లో చేయబోతున్నారు. ఇందులో విక్రమ్తో పాటు మరో యువహీరో ప్రధాన పాత్రలో నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ సరసన రష్మిక మందన్న నాయికగా ఖరారైందని తెలిసింది. గతంలో సుల్తాన్, వారిసు వంటి తమిళ చిత్రాల్లో రష్మిక మందన్న నటించింది. కొంత విరామం తర్వాత ఆమె తమిళంలో నటించబోతున్న చిత్రమిదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ భామ తెలుగులో పుష్ప-2, రెయిన్బో చిత్రాల్లో నటిస్తున్నది.