హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదానికి తెరపడింది. సంతానం పొందే క్రమంలో ఈ జంట చట్టంలోని నిబంధనలు పాటించారని ఈ అంశంపై విచారణ జరుపుతున్న కమిటీ వెల్లడించింది. నయనతార, విఘ్నేష్ శివన్ 2016లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని కమిటీకి సారథ్యం వహిస్తున్న మా సుబ్రహ్మణియన్ తెలిపారు.
ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్లే వీరు సంతానం కోసం రెండేళ్ల కిందట సరోగసీని ఎంచుకున్నారని ఈ దంపతుల మెడికల్ డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. తమకు ఇద్దరు మగ బిడ్డలు కలిగారంటూ ఈ నెల 9న విఘ్నేష్ శివన్ వెల్లడించారు. జూన్లో వివాహం చేసుకున్న ఈ జంట నాలుగు నెలల్లోనే సంతానాన్ని పొందారంటే సరోగసీ ద్వారానే సాధ్యమైందని, వీరు ఆ చట్టాన్ని ఉల్లంఘించారని విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం కమిటీని నియమించింది.