‘రామారావు ఆన్ డ్యూటీ’తో నా కెరీర్లో ఇప్పటిదాకా చేయని కొత్త తరహా సినిమాలో నటించాను. కథ, క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉంటాయి’ అన్నారు రవితేజ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కించారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు.
ఆదివారం హైదరాబాద్లో చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హీరో నాని ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ…‘ఇంతకుముందెన్నడూ నేను ఇలాంటి కథలో నటించలేదు. శరత్ కొత్త దర్శకుడైనా కథను చక్కగా తెరకెక్కించాడు. నిర్మాత సుధాకర్ మంచి మిత్రుడు అయ్యారు. ఆయనతో ఎన్ని సినిమాలు చేసేందుకైనా సిద్ధం. మా కార్యక్రమానికి వచ్చిన నానికి థాంక్స్. అతనంటే నాకు చాలా ఇష్టం. వేణు తొట్టెంపూడితో ‘స్వయంవరం’ సినిమా చేయాల్సి ఉండేది.
అప్పుడు మిస్ అయ్యింది. ఇకపై మేము మరిన్ని సినిమాలు చేస్తాం. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ అందంతో పాటు నటనకు అవకాశమున్న పాత్రలు చేశారు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వంటి సాంకేతిక అంశాల్లో సినిమా ఉన్నతంగా ఉంటుంది’ అన్నారు. హీరో నాని మాట్లాడుతూ..‘రవితేజ ఇరవై ఏళ్ల నుంచి ఆన్ డ్యూటీ. రామారావు మాత్రం ఈ నెల 29 నుంచి డ్యూటీలో ఉంటారు. ఇన్నేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ అభివృద్ధికి రవితేజ చేస్తున్న కృషి మనమంతా అర్థం చేసుకోవాలి.
ఎంతోమంది టెక్నీషియన్స్, నటీనటులకు ఆయన సినిమాలతో పని దొరుకుతుంది. రవితేజ చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకున్నట్లే. మాతరం హీరోలకు రవితేజ స్ఫూర్తిగా నిలుస్తారు. నేను ఏ సినిమా చేసినా ఫోన్ చేసి అభినందిస్తారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా బాగుంటుందని చెప్పగలను’ అన్నారు. ‘ట్రైలర్ ఎంత బాగుంటుందో సినిమా అంతకంటే బాగుంటుంది. రవితేజ వల్లే ఈ సినిమా సాధ్యమైంది.
ఆయన మంచి నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. ఈ సినిమాకు సాధారణ టికెట్ రేట్లనే ఉంచుతున్నాం. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి’ అని దర్శకుడు శరత్ మండవ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు చెరుకూరి సుధాకర్, శ్రీకాంత్, నాయికలు రజిషా విజయన్, దివ్యాంశ కౌశి క్, నటుడు వేణు, దర్శకుడు బాబీ, నటి అన్వేషి జైన్ తదితర చిత్ర బృందం పాల్గొన్నారు.