తమిళ అగ్రహీరో ధనుష్ తమ కుమారుడని, చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి వచ్చాడంటూ మధురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు గత నాలుగేళ్లుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి వారు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే న్యాయపరంగా వారికి ఎలాంటి మద్దతు లభించలేదు. కదిరేషన్ దంపతుల వ్యవహారంతో విసిగిసోయిన ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా..తాజాగా ఆ దంపతులిద్దరికి లీగల్ నోటీసులు పంపించారు. తమ పేరుప్రఖ్యాతులకు భంగం కలిగించే చర్యలకు స్వస్తి పలకాలని, నాలుగేళ్లుగా చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెబుతూ క్షమాపణ కోరాలని ధనుష్ ఆ నోటీసులో పేర్కొన్నారు. లేని పక్షంలో పదికోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధనుష్ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ సినీ పరిశ్రమలో హాట్టాపిక్గా మారింది.