హర్ష, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్కుమార్ నిర్మించారు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది.
గురువారం ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అగ్ర నటుడు చిరంజీవి వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ …ట్రైలర్ చాలా బాగుందని, హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్లుందని ప్రశంసించారు. ఆసాంతం కామెడీ ప్రధానంగా ఈ సినిమా తీశారని అర్థమవుతోందని అన్నారు. సుందరం మాస్టర్ పాత్ర మనలో ఒకరిగా ఉంటుందని, కామెడీతో పాటు అద్భుతమైన డ్రామా ఉంటుందని, అందరినీ ఆలోచింపజేసే చిత్రమిదని హీరో హర్ష తెలిపారు.
‘ఓ గిరిజన గ్రామంలో అందరూ అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడటానికి ఓ బలమైన కారణం ఉంటుంది. అదేంటో సినిమా చూస్తే తెలుస్తుంది. నేను చూసిన సంఘటనలతో కథ రాసుకున్నా’ అని దర్శకుడు కల్యాణ్ సంతోష్ పేర్కొన్నారు. రవితేజతో కలిసి ఈ సినిమా తీశానని, ఆయన ఎంతగానో సహకారం అందించారని నిర్మాత సుధీర్ కుమార్ అన్నారు.