Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో రోజులుగా హరిహర వీరమల్లు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకి పూర్తైంది. అయితే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు జూలై 24న విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రం నుంచి క్రిష్ తప్పుకున్నారు. ఏఎం రత్నం, దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం.
కొద్ది సేపటి క్రితం మూవీ ట్రైలర్ విడుదల చేయగా, ఇది ఫ్యాన్స్లో అంచనాలు భారీగా పెంచింది. 2 నిమిషాల 57 సెకన్ల నిడివితో ట్రైలర్ రిలీజ్ అయింది. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ ఎలాంటి అరాచకాలు చేస్తారో చూపిస్తారు. ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్.. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి అని తనికెళ్ళ భరణి డైలాగ్ చెప్పినప్పుడు గుర్రాన్ని ఛేజ్ చేస్తూ పవన్ పవర్ ఫుల్ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పించింది.
ఇప్పటి వరకు మేకల్ని తినే పులుల్ని చూసి ఉంటారు.. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ పవన్ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హైలైట్. చివర్లో బాబీ డియోల్ ఆంధీ వచ్చేసింది అని పవన్ ని తుఫాన్ తో పోల్చడం మరో హైలైట్. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ..పవన్ నహీ.. ఆంధీ హై అని మాట్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మోదీ చెప్పిన డైలాగ్ పవన్ సినిమాలో వినిపించడంతో ఈ డైలాగ్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఓవరాల్ గా హరిహర వీరమల్లు ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. కీరవాణి అందించిన బిజియం ట్రైలర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది అని చెప్పొచ్చు.