కమెడియన్ సునీల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 200 సినిమాలకు పైగా నటించిన ఈయన.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు కమెడియన్ గా నటించిన ఈయన.. ఆ తర్వాత హీరో అయ్యాడు.. మధ్యలో కారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి.. తాజాగా విలన్ కూడా అయ్యాడు. ఫిబ్రవరి 28న ఈయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా సునీల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం హీరోగానే కాకుండా కమెడియన్, కారెక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తూ బిజీ అయ్యాడు ఈయన. దాదాపు 200 సినిమాలు కమెడియన్ గా నటించిన తర్వాత 2006లో అందాల రాముడు సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన కూడా మళ్లీ కమెడియన్ గానే కంటిన్యూ అయ్యాడు సునీల్. మర్యాద రామన్న సినిమా తర్వాత పూర్తి స్థాయిలో హీరోగా మారిపోయాడు. సిక్స్ ప్యాక్ కూడా చేసి యాక్షన్ సినిమాలు సైతం చేశాడు.
కానీ మర్యాద రామన్న, పూల రంగడు లాంటి విజయాల తర్వాత సునీల్ కోరుకున్న హిట్స్ ఎక్కువగా రాలేదు. దాంతో మళ్లీ కమెడియన్ గా యూ టర్న్ ఇచ్చాడు సునీల్. గత మూడు నాలుగేళ్లుగా హీరోగా మానేసి బుద్ధిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయాడు. మొన్న విడుదలైన అల్లు అర్జున్ పుష్ప సినిమాలో విలన్ గా కూడా నటించాడు సునీల్. ఇందులో ఈయన పోషించిన మంగళం శ్రీను పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ హీరో అవుతున్నాడు ఈయన. నిజానికి ఆ మధ్య హరీష్ శంకర్ కథ అందించిన వేదాంతం రాఘవయ్య సినిమాతో మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు సునీల్. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. తాజాగా కుంభకర్ణ అనే సినిమాతో మళ్ళీ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు భీమవరం బుల్లోడు. అభిరామ్ పిల్ల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సాధారణంగా కుంభకర్ణ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది నిద్ర.. కానీ ఈ సినిమాకు ట్యాగ్ లైన్ పడుకుంటే పోతాడు.
ఇందులో సునీల్ క్యారెక్టర్ హిలేరియస్ గా ఉండబోతుంది. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ సినిమాతో హీరోగా మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు సునీల్. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మళ్లీ ఆ తర్వాత హీరోగా నటించడానికి సునీల్ కు ఎలాంటి సమస్య లేకపోవచ్చు. మరి చూడాలి ఏం జరుగుతుందో.