Tollywood | ‘హనుమాన్’ సూపర్హిట్. రోజుకో రికార్డు బ్రేక్ చేస్తూ.. టాలీవుడ్ సత్తా చాటుతున్న చిత్రమిది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల విశ్లేషణ ఒక్కతీరుగా లేదు. కొందరు అద్భుతం అంటున్నారు. మరికొందరు ఫర్వాలేదని తీర్మానిస్తున్నారు. ‘హనుమాన్’ మానియా కొనసాగుతుండగానే.. గతంలో దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘శ్రీ ఆంజనేయం’ ప్రస్తావనా వైరల్ అవుతున్నది. అప్పుడెప్పుడో వచ్చి ఫ్లాప్టాక్ మూటగట్టుకున్న సినిమాపై ప్రేక్షకులు ఇప్పుడు కొండంత అభిమానం వ్యక్తం చేస్తుండటం ఆశ్చర్యం. ఆ సినిమానే బాగుందని కొందరు విశ్లేషిస్తుండగా, కాస్త ట్రీట్మెంట్ చేసి ఉంటే.. ‘శ్రీ ఆంజనేయం’ బంపర్ హిట్ అయి ఉండేదని పోస్టుమార్టం చేస్తున్నారు.
కమల్హాసన్ హీరోగా నటించిన ‘పోతురాజు’ స్క్రీన్ప్లేకు కొత్త నిర్వచనం చెబుతుంది. డ్యూయల్ స్క్రీన్ప్లే ప్రయోగంతో తెరకెక్కిన ‘పోతురాజు’ సినీ అభిమానులకు మొత్తంగా నచ్చింది. కానీ, సగటు ప్రేక్షకుడికి మాత్రం సగం కూడా అర్థం కాకుండా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. తర్వాతి కాలంలో యూట్యూబ్లో రికార్డు స్క్రీన్టైమ్ సొంతం చేసుకోవడం ‘పోతురాజు’ విజయంగా చెప్పొచ్చు.
విభిన్న తరహా చిత్రాలు తెరకెక్కించే దర్శకుల్లో ఒకరు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలు నిదానంగా విజయం సొంతం చేసుకుంటాయి. రానాను హీరోగా పరిచయం చేస్తూ ఆయన తీసిన ‘లీడర్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. సీరియస్ పొలిటికల్ డ్రామాలో ప్రేమకథను పొదిగే ప్రయత్నం విఫలం కావడమే ఈ సినిమా పరాజయానికి కారణం అంటారు విశ్లేషకులు. ఆనాడు సినిమా బాగాలేదన్న ప్రేక్షకులే టీవీలో ‘లీడర్’ వస్తే చూడకుండా ఉండలేరన్నది కాదనలేని నిజం.
థియేటర్లో ఓడి, టీవీలో గెలిచిన మరో చిత్రం ‘ఆరెంజ్’. ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నంగా, భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అంతే అంచనాల మధ్య విడుదలైంది. ‘మగధీర’ విజయంతో ఒక్కసారి స్టార్డమ్ తెచ్చుకున్న రామ్చరణ్ సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు విడుదల అవతుందా అని ఎదురుచూశారు. థ్రిల్లింగ్ అంశాలు మిస్సవ్వడం, డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్ రుచించక పోవడంతో సినిమా పరాజయం పాలైంది. లవ్, బ్రేకప్ రెండిటినీ సమానంగా సెలెబ్రేట్ చేసుకుంటున్న యువతలో ‘ఆరెంజ్’ అభిమానులు కోకొల్లలు.
సిద్ధార్థ్, షామిలి జంటగా వచ్చిన ‘ఓయ్!’ ప్రయోగాత్మక ప్రేమకథా చిత్రం.బాలనటిగా బహుళ జనాదరణ పొందిన షామిలి కథానాయికగా పరిచయం కావడం, లవర్ బాయ్గా ముద్రపడిన సిద్ధార్థ్ హీరోగా నటించడంతో ఈ సినిమా హిట్టవ్వడం ఖాయం అనుకున్నారు. కానీ, ఆకట్టుకునే సబ్జెక్ట్తో తెరకెక్కినా..ప్రేక్షకులకు కావాల్సినంత కిక్కు ఇవ్వడంలో విఫలమై వసూళ్ల దగ్గర ‘ఓయ్!’ చేతులెత్తేసింది. టీవీలో మాత్రం సకుటుంబ సపరివారంగా చూడదగ్గ సినిమాగా మార్కులు కొట్టేసింది.
ఈ వాదనపై ఓ అభిమాని ఎక్స్లో చేసిన పోస్టుపై కృష్ణవంశీ తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నాడు… ‘ప్రేక్షకుల దెప్పుడూ తప్పు కాదు. వారికి సినిమా నచ్చకపోతే ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. లేదంటే ఆ సినిమా వారికి చేరువ కావడంలో సమస్య ఉండి ఉంటుంది. ఆడియన్స్ను నిందించొద్దు. కొన్ని అంశాల విషయంలో నాది తప్పై ఉండొచ్చు’ అని వినమ్రంగా రాసుకొచ్చాడు.
అవును సినిమాను ఆదరించడంలో ప్రేక్షకులది ఎప్పుడూ తప్పుకాదు. థియేటర్లో చూసి పెదవి విరిచిన సినిమాలు.. టీవీలో వచ్చినప్పుడు కండ్లప్పగించి చూడగల మంచోడు ప్రేక్షకుడు. తొలి రిలీజ్లో అనాదరించిన చిత్రాలను.. మలి విడుదలలో బంపర్ హిట్ చేయించిన ఘనుడు ప్రేక్షకుడు. ఇలా ప్రేక్షక దేవుళ్ల ఆదరణకు దూరమై.. అభిమానానికి దగ్గరైన సినిమాలు టాలీవుడ్లో కోకొల్లలు! వాటిలో కొన్ని ఇవి..
‘వెల్ మిష్టర్ వెంకటేశం..’ అని ‘ద గ్రేట్ గిరీశం… చుట్టపై పద్యం కడితే..’ ప్రేక్షకులకు రుచించలేదు. ‘లొ.. లొ.. లొట్టిపిట్ట..’ అని మధురవాణి పాత్రలో సావిత్రి విరగబడి నవ్వితే.. కోపగించుకున్నారు. ‘కన్యాశుల్కం’ రంగస్థల నాటకానికి రుచిమరిగిన ఆనాటి ప్రేక్షకులను వెండితెర గిరీశం అలరించలేకపోయాడు. గురజాడ అప్పారావు రాసిన సాంఘిక నాటకం ‘కన్యాశుల్కం’. దీని ఆధారంగా అదే పేరుతో దర్శకుడు పి.పుల్లయ్య 1955లో సినిమా తెరకెక్కించారు. గిరీశంగా ఎన్టీఆర్, రామప్ప పంతులుగా సీయస్సార్, మధురవాణిగా సావిత్రి, లుబ్ధావధాన్లుగా గోవిందరాజుల సుబ్బారావు, ఇతర పాత్రల్లో వంగర, విన్నకోట రామన్నపంతులు, షావుకారు జానకి ఇలా హేమాహేమీలంతా తెరపంచుకున్నా… బాక్సాఫీస్ దగ్గర ముక్తసరిగా కాసులు వసూలు చేసింది. అయితే, ఇదే సినిమా మళ్లీ 28 ఏండ్ల తర్వాత రీ రిలీజైంది. అప్పుడు మాత్రం రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది. పాతికేండ్లలో రంగస్థలం ప్రభావం నుంచి బయటపడ్డాక గానీ ‘కన్యాశుల్కం’ మాయాజాలం ప్రేక్షకులకు అర్థం కాలేదని విమర్శకుల ఉవాచ!
ముందస్తుగా వచ్చి దెబ్బతిన్నవి, ఆలస్యంగా వచ్చి కుదేలైన సినిమాలూ తెలుగులో ఉన్నాయి. బాపు-రమణది టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్. సినిమాను కావ్యంలా తీర్చిదిద్దడంలో ఇద్దరూ సిద్ధహస్తులే! వీరిద్దరూ చేసిన ప్రయోగమే ‘బంగారుపిచిక’. 1968లో చంద్రమోహన్ హీరోగా వచ్చిన ఈ సినిమా.. అప్పటి ప్రేక్షకుల బుర్రకెక్కలేదు. ఇదే సినిమాను 1994లో రీమేక్ చేసి నరేశ్ హీరోగా ‘పెళ్లికొడుకు’ పేరుతో బాపు-రమణ ద్వయం విడుదల చేసింది. అప్పుడూ అంతంత మాత్రంగానే ఆడింది.
ఈ జోడు సినిమాలు ఇలా విఫలం కావడానికి కారణం ఏంటని వారిని అడిగితే.. ‘బంగారుపిచిక టూ ఎర్లీ అయింది.. పెళ్లికొడుకు టూ లేట్ అయింది’ అని సమాధానమిచ్చారట. ఎంచుకున్న సబ్జెక్ట్కు టైమింగ్ కూడా చాలా అవసరం. కాలం కలిసి రాకపోతే తాడే పామవుతుందని కదా పెద్దల మాట! ఈ రెండు చిత్రాల విషయంలో అదే జరిగింది. టైమింగ్ మిస్సవ్వడం వల్ల రెండుసార్లూ ఈ దర్శక దిగ్గజానికి ప్రేక్షకుల విమర్శలు తప్పలేదు!
త్రివిక్రమ్, మహేశ్బాబు కాంబినేషన్లో ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమా వచ్చింది. ఈ చిత్ర నిర్మాణం మొదలైన నాటినుంచీ.. వీరిద్దరి ‘ఖలేజా’ ముచ్చట్లే చక్కర్లు కొట్టాయి. ‘గుంటూరు కారం’ విడుదలయ్యాక మాత్రం ‘ఖలేజా’ అంత కుదర్లేదు అనుకున్నారు సగటు ప్రేక్షకులు. అలాగని “ఖలేజా’ అద్భుతంగా ఆడిందా… ’ అంటే అదీ లేదు. బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయం మూటగట్టుకున్న ఈ సినిమాను టీవీలో ప్రసారమైనప్పుడు మాత్రం వేలం వెర్రిగా చూశారు. ‘ఇంత మంచి సినిమా అప్పుడు ఎందుకు నచ్చలేదబ్బా..’ అని ముక్కున వేలేసుకున్నారు కూడా! ‘అతడు’తో వీరిద్దరూ సృష్టించిన సంచలనం, ‘పోకిరి’తో మహేశ్బాబుపై పెరిగిన అంచనాలను తలకిందులు చేస్తూ ‘ఖలేజా’ ట్రీట్మెంట్ కొనసాగడంతో.. ప్రేక్షకులు సినిమాను అర్థం చేసుకోవడంలో తడబడ్డారు. ఫలితం కలెక్షన్లపై ప్రభావం చూపింది.
చిరంజీవిలోని అద్భుత నటుణ్ని పరిచయం చేసిన సినిమాలు ‘రుద్రవీణ’, ‘ఆపద్బాంధవుడు’. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే వసూళ్లు రాబట్టాయి. మెగాస్టార్ మార్కు ఫైటింగ్లు, డ్యాన్సులు లేకపోవడమే ఈ సినిమాలకు శాపమైంది. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రవీణ’ అపురూప చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. అవార్డులూ రాబట్టింది. కానీ, ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. థియేటర్లో పెదవి విరిచిన ప్రేక్షకులు ఇప్పటికీ టీవీలో ‘రుద్రవీణ’ వస్తుందంటే.. చూడకుండా ఉండలేరు. చానల్ సర్ఫింగ్ ఆపేసి మరీ.. ప్రతి సన్నివేశాన్నీ మనసుతో వీక్షిస్తారు. అంతేకాదు, ఆ సినిమాలోని పాటలన్నీ నేటికీ వాట్సాప్ స్టేటస్గా అలరిస్తున్నాయి.
‘ఆపద్బాంధవుడు’ కూడా అంతే! కళాతపస్వి విశ్వనాథ్, చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కిన మూడో సినిమా ఇది. అప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన‘శుభలేఖ’, ‘స్వయంకృషి’ హిట్లు సాధించాయి. ‘ఆపద్బాంధవుడు’తో హ్యాట్రిక్ సొంతం అనుకున్నారు! కానీ, ఇందులో విశ్వనాథ వారి కళలు పండకపోవడం, చిరంజీవి మార్కు కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో.. ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. అయితే, ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ఎప్పుడొచ్చినా.. రికార్డు టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంటుండటం విశేషం.
చివరగా… ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు కృష్ణవంశీ. ఆయన డిఫరెంట్ ప్రజెంటేషన్ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది. లేదంటే విపరీతంగా విసుగు తెప్పిస్తుంది. ‘సిందూరం’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘మురారి’, ‘ఖడ్గం’, ‘చందమామ’ తదితర చిత్రాల్లో పండిన ఈ తరహా టేకింగ్.. ‘శ్రీ ఆంజనేయం’లో వర్కవుట్ కాలేదు. కథలో బలమున్నా, అమాయకుడి పాత్రలో నితిన్ మెప్పించినా, ఆంజనేయుడిగా అర్జున్ ఇరగదీసినా.. కథానాయిక పాత్రను ఫైన్ట్యూన్ చేయలేక చేతులు కాల్చుకున్నాడు కృష్ణవంశీ. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి… పరమాన్నం తింటున్నప్పుడు పదేపదే పంటికింద రాయి తగిలినట్టయింది. మొత్తంగా పవర్ఫుల్ సినిమా పత్తాలేకుండా పోయింది. ఆ సినిమాపై ప్రేక్షకుల తీర్పును సగౌరవంగా మన్నించిన కృష్ణ వంశీపై నెటిజన్లు ఇప్పుడు ప్రశంసలు కురిపించడం కొసమెరుపు.