Hansika Motwani | సినీ నటి హన్సిక కుటుంబంలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా కోర్టు మెట్లెక్కాయి. తనపైనా, తన కుటుంబంపైనా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ హన్సిక తన వదిన నాన్సీ జేమ్స్పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య నాన్సీ జేమ్స్ గతంలో సోషల్ మీడియా వేదికగా తన అత్తగారి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గృహహింస, మానసిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి.
అయితే ఈ ఆరోపణలను హన్సిక తీవ్రంగా ఖండించారు. కేవలం డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే నాన్సీ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోర్టులో తెలిపారు. తమ స్టార్ ఇమేజ్ను ఉపయోగించుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇన్నాళ్లు ఈ వివాదంపై మౌనంగా ఉన్నానని, కానీ పరిస్థితులు హద్దులు దాటడంతో న్యాయపోరాటానికి దిగాల్సి వచ్చిందని హన్సిక పేర్కొన్నారు. సోషల్ మీడియాలో నాన్సీ చేసిన వీడియోలు, కామెంట్లు తన తల్లి గౌరవాన్ని దెబ్బతీశాయని, కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు నాన్సీ జేమ్స్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. హన్సిక కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలు చేయవద్దని, ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియోలను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు కేసు ప్రాధాన్యతను మరింత పెంచాయి.
హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని కూడా ఈ వివాదంలో తన సోదరికి అండగా నిలిచారు. తన భార్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. వివాహం తర్వాత కొద్దికాలానికే తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని, ఇప్పుడు అవి కుటుంబ స్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. హన్సిక తరపు న్యాయవాదులు ఈ వ్యవహారాన్ని వ్యాపార ప్రయోజనాలు లేదా వ్యక్తిగత కక్షల కోణంలో చూస్తున్నారు. నాన్సీ కావాలనే వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారని వాదిస్తున్నారు. ఇక కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఈ వ్యవహారం మరింత మలుపులు తిరిగే అవకాశముంది. హన్సిక కోరిన రూ.2 కోట్ల పరిహారం, అలాగే భవిష్యత్తులో నాన్సీ చేసే వ్యాఖ్యలపై కోర్టు నిర్ణయం కీలకంగా మారనుంది.