మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ చిత్రం నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. అతడు, ఖలేజా వంటి బ్లాక్బస్టర్ విజయాల తర్వాత త్రివిక్రమ్-మహేష్బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రమిదే కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలకానుంది. మంగళవారం దర్శకుడు త్రివిక్రమ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ధమ్ మసాలా’ గీతాన్ని విడుదల చేశారు.
రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతాన్ని సంజిత్హెగ్డే, జ్యోతి నూరన్ ఆలపించారు. తమన్ స్వరకర్త. సరికొత్త ట్యూన్, మాస్ బీట్తో ఈ పాట ఆకట్టుకునేలా సాగింది. ‘నా తలరాతే రంగుల రంగోలి, దిగులైనా చేస్తా దీవాళి. నా నవ్వుల కోటని నేనే ఎందుకు పడగొట్టాలి’..‘నేనో నిశ్శబ్దం..అనునిత్యం నాతో నాకే యుద్ధం’ వంటి చరణాలు హీరో స్వభావాన్ని ఆవిష్కరిసూ సాగాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, జయరామ్, ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.