‘గత 25 ఏండ్లుగా మీరు చూపిస్తున్న అభిమానాన్ని మరచిపోలేను. ప్రతి ఏడాది అది పెరిగిపోతున్నది. సంక్రాంతి నాన్నగారికి, నాకు బాగా కలిసొచ్చిన పండగ. ఈ సీజన్లో మా సినిమా రిలీజైతే అది బ్లాక్బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొట్టబోతున్నాం’ అన్నారు మహేష్బాబు. ఆయన కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
మంగళవారం ఏపీలోని గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘సినిమాకు వందశాతం పనిచేయాలంటే రెండొందల శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్బాబు ఒక్కరే అని చెప్పడం అతిశయోక్తి కాదు. అతడు, ఖలేజా టైమ్లో మహేష్ బాబు ఎలా ఉన్నాడో.. ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. పర్ఫార్మెన్స్లో కూడా అంతే నూతనత్వం కనిపిస్తున్నది.
ఈ సంక్రాంతిని రమణగాడితో కలిసి జరుపుకుందాం’ అన్నారు. మహేష్బాబు మాట్లాడుతూ ‘త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫ్రెండ్కంటే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్లా ఫీలవుతాను. ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా పర్ఫార్మెన్స్ విషయంలో ఓ మ్యాజిక్ జరిగిపోతుంది. అతడు, ఖలేజా సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉందనిపిస్తుంది. ‘గుంటూరు కారం’ విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమాలో కొత్త మహేష్బాబుని చూడబోతున్నారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘కుర్చీ మడతపెట్టి..’ పాటకు థియేటర్లు బద్దలైపోతాయి. నాన్నగారు నా సినిమా చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించేది. ఆయన ఫోన్ కాల్ కోసం ఎదురుచూసేవాడిని. ఇప్పుడు ఆ వివరాలన్నీ మీరే నాకు చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న’ అన్నారు.
‘గంటూరు కారం’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. సింగిల్ స్క్రీన్స్లో 65 రూపాయలు, మల్లీఫ్లెక్స్లలో 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ నెల 12 అర్థరాత్రి ఒంటిగంట నుంచి రాష్ట్రంలోని 23చోట్ల బెనిఫిట్ షోల ప్రదర్శనకు కూడా పర్మిషన్ ఇచ్చింది. వీటితో పాటు ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం నాలుగు గంటల షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.