గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘అందాల రాశీ..’ అనే గీతాన్ని జూన్ 1న విడుదల చేయబోతున్నారు. ‘ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది.
దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్సాంగ్ శ్రోతల ఆదరణ చూరగొంది. ‘అందాల రాశీ..’ గీతం చక్కటి మెలోడీగా మెప్పిస్తుంది. ప్రేమలోని మధురభావనలకు అద్దం పట్టేలా ఉంటుంది. గోపీచంద్, రాశీఖన్నా జంటపై చిత్రీకరించిన ఈ పాట కన్నులపండువగా అనిపిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది.
ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్ల, సంగీతం: జకేస్ బీజాయ్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సమర్పణ: అల్లు అరవింద్, దర్శకుడు: మారుతి.