గూఢచారి, మేజర్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు యువహీరో అడివి శేషు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గూఢచారి2’ నిర్మాణంలో ఉంది. ఆ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో అడివి శేషు నటించనున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుండటం విశేషం.
యార్లగడ్డ సుప్రియ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా క్షణం, గూఢచారి చిత్రాల ఛాయాగ్రాహకుడు షానెల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో శృతీహాసన్ కథానాయిక కావడం మరో విశేషం. పాన్ ఇండియా యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని, హిందీతోపాటు తెలుగులోనూ విడివిడిగా చిత్రీకరణ జరుపుతామని, రూపొందించే ప్రతి భాషలోనూ నేటివిటీకి తగ్గట్టుగా చిత్రీకరణ ఉంటుందని చిత్రబృందం తెలియజేశారు. ఈ చిత్రానికి కథ, కథనం: అడివి శేష్, షానెల్ డియో, సహ నిర్మాత: సునీల్ నారంగ్.