Golden Globe Awards | గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నిర్వహకులు సినిమాల్లో ఏఐ వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హాలీవుడ్లో రోజురోజుకూ పెరుగుతున్న ఏఐ ప్రభావం నేపథ్యంలో 2027 అవార్డుల కోసం ప్రత్యేక నిబంధనలను ప్రకటించారు. ఇటీవల ఆస్కార్ అవార్డ్స్ కూడా ఇలాంటి మార్గదర్శకాలను తీసుకురావడంతో.. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ సంస్థ కూడా స్పష్టమైన నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది. నిర్వాహకుల ప్రకటన ప్రకారం.. భవిష్యత్తులో అవార్డులకు పంపించే సినిమాల్లో ఏఐ వినియోగం ఉండవచ్చని అంగీకరించినప్పటికీ, మానవ సృజనాత్మకతే ప్రధానంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏఐ పూర్తిగా నిషేధించకపోయినా, దాన్ని కేవలం సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
ముఖ్యంగా చిత్రాల్లో ఏ సన్నివేశానికి అయినా ఏఐ ఉపయోగించినట్లయితే, దాని వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. నటీనటుల స్వరం, రూపం లేదా భావ వ్యక్తీకరణలను కృత్రిమ మేధతో మార్చినట్లయితే.. ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని గోల్డెన్ గ్లోబ్స్ కమిటీ పేర్కొంది. అలాగే నటన విభాగాల్లో ఎంట్రీలను పరిశీలించే సమయంలో.. ఏఐ ఆధారిత మార్పుల కంటే సహజ నటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. కృత్రిమ మేధ సహాయంతో నటనకు మెరుగులు చేర్చినా.. అసలు గుర్తింపు మాత్రం నటీనటుల ప్రతిభకే దక్కుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఇంకా ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా గోల్డెన్ గ్లోబ్స్ సంస్థ ప్రస్తావించింది. ఎలాంటి అనుమతి లేకుండా ఎవరి స్వరం లేదా రూపాన్ని ఏఐ ద్వారా ఉపయోగించినా.. అది పూర్తిగా అనైతికమని, అలాంటి చిత్రాలను ఆమోదించబోమని హెచ్చరించింది. ప్రస్తుతం హాలీవుడ్లో డీప్ఫేక్ టెక్నాలజీ, డిజిటల్ క్లోనింగ్పై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.దర్శకత్వం, రచన, సంగీతం, యానిమేషన్ వంటి విభాగాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. సాంకేతికతను సృజనాత్మకతకు తోడ్పాటుగా మాత్రమే ఉపయోగించాలే తప్ప.. పూర్తిగా దానిపై ఆధారపడకూడదని సూచించారు.
ప్రస్తుతం ప్రపంచ సినీ పరిశ్రమలో ఏఐ వినియోగంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకవైపు టెక్నాలజీ కొత్త అవకాశాలను తెరుస్తుంటే.. మరోవైపు కళాకారుల హక్కులు, మానవ సృజనాత్మకత భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డెన్ గ్లోబ్స్ తీసుకున్న తాజా నిర్ణయం సినీ రంగంలో కీలక మార్పులకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి 10న గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు వేడుకను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.