’కెరీర్ లో ఎన్ని ఘన విజయాలు సాధించినా..ప్రతి సినిమా నాకు ముఖ్యమే. అందుకే ప్రాణం పెట్టి నటిస్తా, గాడ్ ఫాదర్తో ఇంద్ర, ఠాగూర్ లాంటి సూపర్ హిట్ అందించారు’ అన్నారు చిరంజీవి. ఆయన హీరోగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ….’ఈ సినిమా విజయం మీద నమ్మకం ఉన్నా…రిలీజ్ కు ఒక రోజు ముందు నాలో సందేహం మొదలైంది. నాకు బాగా నచ్చిన సినిమాలు కూడా ఆదరణ పొందని సందర్భాలు ఉన్నాయి. విడుదల తేదీన ఒక్కొక్కరుగా సినిమా బాగుందని చెబుతుంటే నిరాశ పోయి ఉత్సాహం వచ్చింది. ఇవాళ ఏకగ్రీవంగా అంతా సినిమా సూపర్ హిట్ అని చెబుతున్నారు.
ఇంద్ర, ఠాగూర్ తర్వాత అంతటి విజయమిది అంటున్నారు. సినిమా బాగుందనే ఒక్క మాట కోసమే మేమంతా నెలల తరబడి కష్టపడతాం. ప్రేక్షకులను అలరించాలనే కోరికే నన్ను ఇంధనంలా నడిపిస్తుంటుంది’ అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ…’ఈ చిత్రానికి మా అందరినీ సారథిగా ఉండి నడిపించిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన దర్శకుడి పనిలో తలదూరుస్తారు అనేది తప్పు. ఆయన అనుభవాన్ని వాడుకోకుంటే అది దర్శకుడి లోపమే.
ఈ సినిమా ప్రతి సీన్ లో చిరంజీవి గారి ఆలోచనలు ఉన్నాయి. మేము ఆయన మాట విన్నాం కాబట్టే ఇవాళ ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నాం’ అన్నారు. నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ….’నటుడిగా నాకు ఇన్నేళ్లలో రాని గుర్తింపు ఈ సినిమాతో దక్కింది. ఈ సినిమాలో నేను బాగా నటించాను అనడం కంటే చిరంజీవి గారి అభిమానిగా నటించాను అని చెప్పడం సరైనది.’ అన్నారు.