వరుణ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. సాక్షి వైద్య కథానాయిక. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. గురువారం ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా వరుణ్తేజ్ మాట్లాడుతూ “2023లో జరిగిన ఓ సమస్య గురించి చర్చించే కథతో సినిమా తీస్తున్నప్పుడు ఓ నటుడిగా ఇలాంటి సినిమాలో చేయడం నా బాధ్యతగా అనిపించింది. అందుకే ఈ కథను ఓకే చేశాను. సినిమా ట్రైలర్ చూసి యాక్షన్ సినిమా అనుకోవద్దు. దానికి మించి సినిమాలో చాలానే వున్నాయి.
ఈ చిత్రంలో నేను బాడీగార్డ్గా కనిపిస్తాను. ఓ వారంలో జరిగే కథ ఇది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమా ఇది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘భూమిపై వున్న వనరులను మన ఇష్టానుసారం వాడేస్తున్నాం. భవిష్యత్ తరాల గురించి మనం ఆలోచించటం లేదు. గ్లోబల్ వార్మింగ్ గురించి జనరలైజ్ చేసి సినిమాను తెరకెక్కించాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, సమర్పకుడు బాపినీడు, సాక్షి వైద్య, నరేన్ తదితరులు పాల్గొన్నారు.