ప్రస్తుతం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘గేమ్ఛేంజర్’ ఒకటి. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు 450కోట్ల భారీ నిర్మాణవ్యయంతో దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తమన్ స్వరాలందిస్తున్న ఈ చిత్రం ఆడియో హక్కులను సారేగమా గ్లోబల్ సంస్థ ఫ్యాన్సీ రేట్ చెల్లించి సొంతం చేసుకుంది. ఇంత క్రేజ్కు కారణం ఇది శంకర్ సినిమా కావడమే అనేది పలువురి అభిప్రాయం. ఎందుకంటే శంకర్ సినిమాల్లో పాటలు ఓ రేంజ్లో ఉంటాయి. ఇప్పటివరకూ ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా సంగీత పరంగా సెన్సేషనే. పైగా ‘బాయ్స్’తో తనకు లైఫ్ ఇచ్చిన శంకర్ సినిమా కావడంతో ప్రాణం పెట్టి మ్యూజిక్ అందించారట తమన్.
దానికితోడు రామ్చరణ్ సినిమా. ఈ కారణాలవల్ల ఈ సినిమా ఆడియోకి అంత క్రేజ్ ఏర్పడింది. ఈ దీపావళికి ‘గేమ్ఛేంజర్’నుంచి ‘జరగండి..’ అంటూ సాగే ఓ పాటను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇదిలావుంటే, రామ్చరణ్ కెరీర్కి ‘గేమ్ఛేంజర్’ ఓ ప్రత్యేకమైన సినిమా. ‘మగధీర’ తర్వాత ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నట్లు తెలుస్తున్నది.
తండ్రి పాత్ర అభిమానుల అంచనాలకు అందని స్థాయిలో ఉంటుందని సమాచారం. జెంటిల్మేన్, భారతీయుడు, ఒకేఒక్కడు చిత్రాల స్థాయిలో కథ, కథనాలు సాగుతాయని, సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుందని వినికిడి. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర పాత్రధారులు.