‘గతంలో ఎన్నడూ ఎరుగని విమాన ప్రమాదం నేడు జరిగింది. దేశమంతా దిగ్భ్రాంతికి లోనై ఉన్నది. నిజానికి ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావాల్సివుంది. కానీ ఈ విషాదం వల్ల ఆయన రాలేకపోయారు. అందుకనే ఆయన తరఫున వివరాలు నేనే అందిస్తున్నా’ అన్నారు దిల్రాజు. ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక వివరాలను తెలియజేసేందుకు గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్రాజు మాట్లాడారు. ‘14ఏండ్ల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను నెలకొల్పింది.
ఈ నెల 14న వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. 2014 నుంచి 2023 వరకూ ప్రతి ఏడాదీ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలుగా ఎంపికైన మూడు సినిమాలకు అవార్డులు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రతి ఉత్తమ చిత్రానికీ హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత ఇలా నాలుగు కేటగిరీల్లో అవార్డులను అందిస్తాం. ఇక 2024కు సంబంధించి, అన్ని కేటగిరీలకూ చెందిన అవార్డులు ఉంటాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఎఫ్డీసీ ఛైర్మన్గా కోరుతున్నాను’ అని దిల్రాజు చెప్పారు.