‘ఈ సినిమా చూసినప్పుడు మనసు బరువెక్కింది. గొప్ప సినిమా చేశానని గర్వంగా అనిపించింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఈ కథ ప్రేక్షకుల్ని వెంటాడుతుంది’ అన్నారు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన ‘గామి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విశ్వక్సేన్ నిజాయితీగా చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం చాలా రిస్క్లు తీసుకున్నాం.
మా కష్టానికి తగిన ఫలితం లభిస్తుందనే నమ్మకం ఉంది. కొత్తరకం సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప సంతృప్తినిస్తుంది. ‘గామి’ ప్రేక్షకాదరణతో గమ్యాన్ని చేరుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. షూటింగ్ మొత్తం ఓ సాహస యాత్రలా జరిగిందని, సాంకేతికంగా ప్రతీ అంశం ఉన్నతంగా ఉంటుందని, చరిత్రలో నిలిచిపోయే చిత్రమవుతుందని దర్శకుడు విద్యాధర్ కాగిత తెలిపారు. ఈ కార్యక్రమంలో నవదీప్, అజయ్భూపతి, ఎస్కేఎన్, వశిష్ట, చిత్ర కథానాయిక చాందిని చౌదరి తదితరులు పాల్గొన్నారు.