గడిచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం ! అలాగే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పలేం !! కానీ వీటిని సాధ్యం చేయడానికి ఓ టైం మిషన్ ఉంటే ! అది ఎక్కగానే మనకు కావాల్సిన చోటుకు వెళ్లగలిగితే.. భలే ఉంటుంది కదా !! ఈ కాన్సెప్ట్తో 30 ఏళ్ల క్రితం వచ్చిన సినిమానే ఆదిత్య 369. హాలీవుడ్లో ఇలాంటి సినిమాలను మనం చాలానే చూశాం.. కానీ 30 ఏళ్ల క్రితం గ్రాఫిక్స్ సౌకర్యం అంతగా లేని రోజుల్లో తొలి ఇండియన్ సైన్స్ ఫిక్సన్ సినిమా తీసి ఔరా అనిపించారు సింగీతం శ్రీనివాసరావు. బాలకృష్ణ నటన ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. మొత్తానికి ఈ సినిమా క్లాసిక్గా నిలిచింది. అసలు ఆ రోజుల్లో టైం మిషన్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఆ సినిమా ఎలా పట్టాలెక్కింది? వంటి విషయాలు ఒకసారి చూద్దాం..
వైవిధ్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన ఒకసారి టైమ్ మిషిన్ అనే నవలను చదివారు. తెలుగు ప్రేక్షకుల నేపథ్యానికి అనుగుణంగా ఈ కథను మార్చి సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అంతే ఒక మనిషి గడిచిన కాలంలోకి.. అలాగే భవిష్యత్తులోకి వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఒక కథను రాయడం మొదలుపెట్టారు. ఆంధ్రులు అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది శ్రీ కృష్ణదేవరాయలు. కాబట్టి గతంలోకి వెళ్తే శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని చూపిస్తే బాగుంటుందని అనుకుని దానికి తగ్గట్టు కథ సిద్ధం చేయడం మొదలు పెట్టారు. మరి భవిష్యత్తులోకి వెళ్తే ఎలాంటి కాలాన్ని చూపెట్టాలి.. రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు రావచ్చు అనేవి మాత్రం సింగీతం శ్రీనివాసరావుకు పెద్దగా ఆలోచన తట్టలేదు. దీంతో అప్పటి మద్రాసులోని అమెరికన్ లైబ్రరీకి వెళ్లి కొన్ని పుస్తకాలు చదివి సమాచారం సేకరించాడు. దాని ఆధారంగా స్క్రిప్టు రాసుకున్నాడు సింగీతం.
స్క్రిప్టు రెడీ అయింది.. మరి సినిమా ఎవరితో చేయాలి? ఇలాంటి కథను ఎవరు ఒప్పుకుంటారు? దీన్ని సినిమాగా తీయాలంటే బడ్జెట్ కూడా బాగానే అవుతుంది కదా? ఇలాంటి సందేహాలు సింగీతం మనసులో ఉండిపోయాయి. అలాంటి సమయంలో ఒకసారి చెన్నై నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్తుండగా సింగీతం పక్కన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూర్చున్నారు. తన మనసులో ఉన్న ట్రావెల్ మిషన్ స్టోరీని ఎస్పీబీకి సింగీతం చెప్పారు. కథ వినగానే బాలు చాలా ఎగ్జైట్ అయ్యారు. తన దగ్గరి బంధువు అయిన నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ను కలవమని.. ఆయన దగ్గర బాలకృష్ణ డేట్స్ ఉన్నాయని చెప్పాడు. దీంతో సింగీతం వెళ్లి కృష్ణప్రసాద్ను కలిశారు. అయితే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్పై రాని ఇలాంటి కథతో సినిమా తీయడం నిజంగా సాహసమే అవుతుందని కృష్ణప్రసాద్ ముందుగా ఒప్పుకోలేదు. దీంతో బాలునే ముందుకొచ్చి కృష్ణప్రసాద్ను ఒప్పించాడు. భవిష్యత్తులో నువ్వు ఎన్ని సినిమాలైనా చేయొచ్చు.. కానీ ఈ సినిమా నీ కెరీర్లో ల్యాండ్ మార్క్లా నిలబడుతుందని కృష్ణప్రసాద్ను ఎస్పీబీ ఒప్పించాడు. బాలు ఇచ్చిన ధైర్యంతోనే సింగీతంతో ఈ సినిమా చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో కృష్ణప్రసాద్నే తెలిపాడు.
ఈ టైం మిషన్ కథకు, శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రకు బాలకృష్ణ అయితే బాగుంటారని ఎస్పీబీనే సలహా ఇచ్చారు. దీంతో సింగీతం వెళ్లి బాలకృష్ణను కలిశారు. ఈ కథకు బాలయ్య ఒప్పుకుంటాడో లేదోనని సింగీతం తొలుత భయపడ్డారు. కానీ కథ చెప్పిన 30 సెకన్లలోనే బాలయ్య ఈ సినిమా చేస్తానని ఒప్పుకున్నారు. నాన్నగారు కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. ఆ పాత్ర నాకూ చేయాలని ఉందని చెప్పి ఒప్పుకున్నారట. అలా ఈ ఆదిత్య 369 పట్టాలెక్కింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
సీక్రెట్ ఏజెంట్స్గా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
అమ్మ కోసం ఇన్ఫోసిస్లో జాబ్ తెచ్చుకున్నా.. నా కోసం సినిమాల్లోకి వచ్చా : అనన్య నాగళ్ల
పీలగా కనిపిస్తున్న రకుల్.. సెటైర్స్ వేస్తున్న నెటిజన్స్