సినీ ప్రియులకు ఫేవరేట్ మూవీ ‘సర్కార్’. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కెరీర్లో ఇదొక ప్రత్యేక చిత్రంగా మిగిలిపోయింది. దర్శకుడు రామ్గోపాల్ వర్మకు పేరే తెచ్చే సినిమా అయ్యింది. హాలీవుడ్ క్లాసిక్ ‘గాఢ్ఫాదర్’ స్ఫూర్తితో వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రంలో అమితాబ్, అభిషేక్ బచ్చన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. సుభాష్ నాగరే క్యారెక్టర్లో అమితాబ్ నటన, పలికించిన భావోద్వేగాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సర్కార్ సిరీస్లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. 2005లో తొలి చిత్రం ‘సర్కార్’, 2008లో ‘సర్కార్ రాజ్’, 2017లో ‘సర్కార్ 3’ చిత్రాలు రూపొందాయి. ఈ మూడు చిత్రాలకూ ఆర్జీవీనే దర్శకత్వం వహించారు.
ఈ ప్రాంఛైజీలో నాలుగో చిత్రాన్ని తీసుకొస్తామని నిర్మాత ఆనంద్ పండిట్ తాజాగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ…‘సర్కార్ ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. త్వరలో ‘సర్కార్ 4’ ఉంటుంది. అలాగే అభిషేక్ బచ్చన్తో మేము నిర్మించిన ‘బిగ్ బుల్’ చిత్రానికీ సీక్వెల్ నిర్మించబోతున్నాం. ఈసారి మరో కొత్త తరహా ఆర్థిక నేరాన్ని కథాంశంగా ఎంచుకుంటాం. ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పారు.