ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో 1954, జనవరి 15న జన్మించారు. నాలుగున్నర దశాబ్దాల కెరీర్లో 850కి పైగా చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన గౌతంరాజు సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ చిత్రాలను అందంగా మలిచారాయన. గౌతంరాజు మృతి పట్ల చిరంజీవి, బాలకృష్ణ సహా సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా సంతాపాలు తెలియజేశారు.
సినిమా రాతనే మార్చేశాడు
సినిమా అదృష్టం రెండు సందర్భాల్లో తేలుతుందంటారు. ఒకటి స్క్రిప్టు టేబుల్ మీద, రెండోది ఎడిటింగ్ టేబుల్ మీద. అలా తన ఎడిటింగ్ టేబుల్ మీద ఎన్నో సినిమాల తలరాతలు మార్చేసిన దిగ్గజ ఎడిటర్ గౌతంరాజు. ఆయన వేసిన కత్తెరే వందలాది చిత్రాలకు సంజీవని అయ్యింది. 1981లో దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రూపొందించిన తమిళ చిత్రం ‘అవల్ ఓరు పచ్చికొళందై’తో ఎడిటర్గా జీవితం ప్రారంభించారు గౌతంరాజు. ఈ దర్శకుడు చిరంజీవితో రూపొందించిన ‘చట్టానికి కళ్లులేవు’ సినిమాతో తెలుగులో గౌతంరాజు ప్రస్థానం మొదలైంది. జంధ్యాల ‘నాలుగు స్తంభాలాట’ ఎడిటర్గా మంచి పేరు తీసుకురాగా..1985 నాటికే 100 సినిమాల మైలురాయికి చేరుకోవడం పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. ఎడిటర్గా ఆయన వేగానికి నిదర్శనమిది. ‘ప్రతిఘటన’ సినిమా ఎడిటర్గా గౌతంరాజు వందో సినిమా.
ప్రతిభను వరించిన పురస్కారాలు
కెరీర్లో పలు సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశారు గౌతంరాజు. ‘పడమటి సంధ్యారాగం’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘కర్తవ్యం’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘పెదరాయుడు’, ‘అతనొక్కడే’, ‘ఖైదీ నెంబర్ 150’, ‘గబ్బర్ సింగ్’, ‘కిక్’, ‘గోపాల గోపాల’, ‘బద్రీనాథ్’, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’..ఇలా అనేక విజయవంతమైన చిత్రాల్లో భాగమయ్యారాయన. సినీ పరిశ్రమలో గౌరవంగా చెప్పుకునే నంది పురస్కారాలు ఆయన ప్రతిభను అనేకసార్లు వరించాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘మయూరి’, ‘హై హై నాయకా’, ‘చందమామ రావే’, ‘భారతనారి’, ‘ఆది’ సినిమాలకు ఆయన ఉత్తమ ఎడిటర్గా నంది ఆవార్డులు అందుకున్నారు..
కొత్త దర్శకులకు కొండంత అండ
కొత్త దర్శకులు అనేక ఊహలతో సినిమాలు రూపొందిస్తుంటారు. వాళ్లు గౌతంరాజును ఎడిటర్గా ఎంచుకునేవారు. ఇలాంటి కొత్త దర్శకులకు ఆయన కొండంత అండగా నిలబడేవారు. ఉత్సాహంగా వాళ్లు ఎక్కువ సీన్స్ చేసేసినా, వాటిని ఒక క్రమంలో పేర్చి సినిమాకు కావాల్సిన ఎమోషన్ తీసుకొచ్చేవారు. వీవీ వినాయక్ ‘ఆది’, సురేందర్ రెడ్డి ‘అతనొక్కడే’ సినిమాలు గౌతంరాజు కత్తెర పదునుతో ఫలితాలనే మార్చేసుకున్నాయి.