‘ఇందులో నా పాత్ర పేరు సౌదామిని. డాక్టర్ కావాలనేది తన కోరిక. అయితే గుర్రం పాపిరెడ్డి పరిచయంతో తన కథంతా మారిపోతుంది. డాక్టర్ కావాలనుకున్నది కాస్తా నర్సుగా పనిచేస్తుంటుంది.’ అని తెలిపింది కథానాయిక ఫరియా అబ్దుల్లా. నరేష్ అగస్త్యకు జంటగా ఆమె నటించిన డార్క్ కామెడీ మూవీ ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకుడు. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్(బాబీ) నిర్మాతలు. శుక్రవారం(నేడు) ఈ సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా గురువారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించింది. ఇంకా చెబుతూ ‘తెలివైన వారికీ, తెలివితక్కువ వారికీ మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. ఇందులో నా పాత్ర ఏ కేటగిరికి చెందినదో మీరే చెప్పాలి. కథ రీత్యా కొన్ని బలీయమైన కారణాల వల్ల గుర్రం పాపిరెడ్డి గ్యాంగ్తో కలిసి నా పాత్ర కూడా ఓ దోపిడీలో భాగం కావాల్సివస్తుంది. ఆ తర్వాత జరిగేదంతా రసవత్తరంగా ఉంటుంది.’ అని ఫరియా అబ్దుల్లా పేర్కొన్నది.
ఇందులో కోర్టు సీన్ హైలైట్గా నిలుస్తుందనీ, మేమంతా డిఫరెంట్ గెటప్పులతో కోర్టుకు అటెండ్ అవుతామని, జడ్జిగా బ్రహ్మానందం నటించారని, కడుపు చెక్కలయ్యేలా ఆ సన్నివేశం ఉంటుందని ఫరియా చెప్పారు. ‘జాతిరత్నాలు’లో చిట్టి పాత్రకూ, ఇందులోని సౌదామిని పాత్రకూ పొంతన ఉండదు. భిన్నమైన గెటప్స్లో ఇందులో కనిపిస్తా. అరుదుగా మాత్రమే లభించే పాత్ర ఇది. దర్శకుడు మురళీమనోహర్ పాషన్తో సినిమా చేశారు. స్క్రిప్ట్లో ఉన్న వినోదాన్ని అంతే గొప్పగా తెరపైకి తీసుకొచ్చారాయన. ఈ సినిమా కోసం ప్రమోషనల్ సాంగ్ చేశా. నాతోపాటు పనిచేసిన అందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది.’ అని నమ్మకం వెలిబుచ్చింది ఫరియా అబ్దుల్లా.