కొరియోగ్రాఫర్గా, దర్శకురాలిగా బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు ఫరాఖాన్. ఆమె 80కి పైగా చిత్రాల్లో దాదాపు 100 పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు. అగ్ర హీరోలతో ఆమె ఎన్నో ఐకానిక్ డాన్స్ మూవ్మెంట్స్ చేయించారు. దర్శకురాలిగా ‘మై హూ నా’, ‘ఓ శాంతి ఓం’, ‘తీస్మార్ ఖాన్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ వంటి చిత్రాలను రూపొందించారామె. 1992లో పరిశ్రమకు వచ్చిన ఫరాకు అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘జో జీతా వొహీ సికందర్’ సినిమా తొలిసారి గుర్తింపు తీసుకొచ్చింది.
తాజాగా 30 ఏళ్ల కెరీర్ను పూర్తి చేసుకుంటున్నదామె. ఈ సందర్భంగా ఫరా ఖాన్ మాట్లాడుతూ…‘ఇండస్ట్రీలో షారుక్ ఖాన్ నాకు మంచి మిత్రుడని అందరికీ తెలుసు. ఆయనతో ‘దిల్వాలే దుల్హనియా లేజాయింగే’ నుంచి పనిచేస్తున్నాను. మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం, ఒకే తరహా పుస్తకాలు చదువుతాం, సినిమాల గురించి ఎక్కువగా చర్చిస్తుంటాం. మొదటిసారి నాలో దర్శకురాలిని చూసింది మాత్రం ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాత యష్ జోహార్. ఆయన నిర్మాతగా అడ్వాన్స్ ఇచ్చినా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. షారుక్ హీరోగా ‘మై హూ నా’ సినిమాతో దర్శకురాలిగా మారాను. ఈ 30 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి’ అని చెప్పింది.