పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ‘గీతగోవిందం’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ని రిపీట్ చేస్తూ అగ్ర నిర్మాతలు దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ఠాకూర్ కథానాయిక. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ‘నందనందనా..’ అంటూ సాగే ఈ సినిమాలోని తొలిపాటను బుధవారం మేకర్స్ విడుదల చేశారు.
అనంత శ్రీరామ్ రాయగా, గోపీసుందర్ స్వరపరిచిన ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. ‘ఏమిటిది.. చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో.. సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో.. హృదయాన్ని గిచ్చీ గిచ్చక.. ప్రాణాన్ని గుచ్చీ గుచ్చక.. చిత్రంగా చెక్కింది దేనికో..’ అంటూ సాగిన లిరిక్ యువతరాన్ని కట్టిపడేసేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పాట ‘ఫ్యామిలీస్టార్’ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్.