నిప్పు లేనిదే పొగరాదు.. మౌనం అర్ధ అంగీకారం.. ఈ ఉవాచలు విజయ్ దేవరకొండ, రష్మికలకు సరిగ్గా సరిపోతాయి. వెకేషన్స్ అంటూ విదేశాలకు చెందిన లొకేషన్లలో వీళ్ల ఫొటోలు విడివిడిగా సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. కానీ కలిసి వెళ్లినట్టు మాత్రం ఎక్కడా కనిపించరు. ప్రేమ, పెళ్లి ప్రస్థావన తెస్తే ఇద్దరూ నర్మగర్భంగానే సమాధానాలిస్తుంటారు. అంతేతప్ప ఇద్దరి మధ్య అనుబంధం ఉందనిగానీ, లేదని గానీ చెప్పరు. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు బాగుంటాయి.
సత్సంబంధాలూ కూడా గట్టిగానే ఉంటాయి. కానీ పెళ్లి గురించి మాత్రం నోరు మెదపరు. వీటిని బట్టి ఏం అర్థం చేసుకోవాలో తెలియక సమమతమైపోతుంటారు అభిమానులు. అయితే.. ఆదివారం జరిగిన ‘కుబేర’ వేడుకలో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ అనుకోకుండా రష్మిక ఓపెనైంది. దీంతో క్లారిటీ ఇచ్చేసిందంటూ చంకలు గుద్దుకుంటున్నారు నెటిజన్లు. వివరాల్లోకెళ్తే.. ‘కుబేర’ వేడుకలో సుమ అక్కడున్న సెలబ్రిటీలను కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడిగింది.
ఈ క్రమంలో రష్మికకు కొందరు హీరోల పేర్లు చెప్పి, వీరిలో నచ్చిన అంశాలేంటి? అనడిగితే.. నాగార్జున, ధనుష్, బన్నీల గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది రష్మిక. చివరిగా సుమ అడగాల్సిన పేరునే అడిగేసింది. అదే.. ‘విజయ్ దేవరకొండ’. ఆ పేరు వినగానే రష్మిక అందంగా నవ్వుతూ.. ‘తనలో అన్నీ ఇష్టమే.. ఎవ్రీథింగ్..’ అంటూ ‘తనంతా నాకే కావాలి..’ అన్నట్టు సమాధానమిచ్చింది. దాంతో అభిమానుల కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.