Bharat Ratna to Ghantasala | ఇప్పటికి ప్రజలు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు పాటతోనే మేల్కొంటారని ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత తనికెళ్ళ భరణి పేర్కొన్నారు. ఘంటసాల ఒక పరిపూర్ణ గాయకుడు, మంచి సంస్కారం గల మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఘంటసాల శత జయంతి సందర్భంగా ఆయనకు భారత్ రత్నఇవ్వాలని కోరుతూ ఈ నెల 21న ఘంటసాల శత గళార్చన కార్యక్రమం తొలి భాగం జరిగింది. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ 48 ఏండ్ల క్రితం మరణించిన ఘంటసాలకు భారత్ రత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ అలుపెరుగని పోరాటం చేస్తున్న కార్యక్రమ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందించారు. ఇంతటి విశ్వవేదికను పంచుకున్న అందరికీ అభినందనలు తెలిపారు. మిథునం సినిమాలో ఒక సన్నివేశంలో వచ్చిన ఘంటసాల ఆలపించిన పుష్పవిలాపం గురించి గుర్తు చేసుకున్నారు. ఘంటసాల సొంత ఊరిని సందర్శించినప్పుడు ఒక అనిర్వచనీమైన అనుభూతిని పొందానని తెలిపారు.
ఇప్పటికీ ప్రతి ఊరూ ఘంటసాల పాటతోనే మేల్కొంటుందని ప్రముఖ సినీ దర్శకులు సుకుమార్ చెప్పారు. ఆయన మన అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. తాను విన్న తొలి గొంతు ఘంటసాలదేనని తెలిపారు. చిన్నప్పుడు తన ఊరిలో దేవాలయంలో వారి పాట `నడిరేయి ఈ జాములో` అన్న పాటతోనే మేల్కొంటుందని పేర్కొన్నారు. ప్రతి ఊళ్లో ఘంటసాల పాటలు పాడేవారు ఒక్కరయినా ఉంటారని, వారికి ఆ ఊరులో ప్రత్యేకస్థానం, గౌరవం ఉంటుందన్నారు. ఘంటసాల శతజయంతి సందర్భంగా ఆ మహా గాయకుడికి భారత రత్న ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
ఘంటసాలకు భారత్ రత్న ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు ఇందుర్తి బాలరెడ్డి ఆధ్వర్యంలో 150కి పైగా టీవీ చర్చాగోష్టులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ నెల 21న ఘంటసాల శత గళార్చన కార్యక్రమం తొలి భాగం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శక నటులు, రచయిత తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్, గేయ రచయితలు చంద్రబోస్, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ సహ నిర్వాహకులుగా విజు చిలువేరు, రత్న కుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, శ్యాం అప్పాలి, నీలిమ గడ్డమణుగు, జయ పీసపాటి, శ్రీలత మగత వ్యవహరించారు. వీరు ప్రపంచ వ్యాప్తంగా 100 మందికి పైగా గాయకులు, గాయనీ మణులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 21న తొలిభాగం ప్రసారం చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 28, సెప్టెంబర్ 4, 11 తేదీల్లో మిగతా భాగాలు ప్రసారం అవుతాయన్నారు.
ఘంటసాల సొంత ఇంట్లో ఆయన కోడలు కృష్ణ కుమారి పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణకుమారి మాట్లాడుతూ రెండేండ్ల క్రితం 100 కేంద్రాల్లో శత జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఘంటసాల రత్నకుమార్ అనుకున్నారన్నారు. అనూహ్యంగా వారు మనను విడిచి వెళ్లడంతో నిర్వాహకులు ఆ బాధ్యత స్వీకరించారని చెప్పారు. ఈ కార్యక్రమ విజయవంతానికి నిర్వాహకులు చేస్తున్న కృషి తమ కుటుంబానికి చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు.
మాస్టార్ తొలి వీరాభిమానిని తానేనని కృష్ణకుమారి చెప్పారు. ఆయన కుటుంబంలోకి రావడం తన పూర్వజన్మ పుణ్యమని అభిప్రాయ పడ్డారు. ఘంటసాల సతీమణి సావిత్రమ్మ నిర్వాహకులకు సందేశం పంపారు. మాస్టార్ అక్కడ ఉన్నట్లే భావించి శత జయంతి ఉత్సవాలు జరుపడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ బృహత్కార్యాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన శ్యాం అప్పాలి బృందం నుంచి సంధ్య ఈశ్వర, కళ్యాణి వల్లూరి, లలిత చింతలపాటి, కిరణ్ కొక్కిరి, అమెరికాలోని బోస్టన్కు చెందిన ఫణి డొక్కా బృందం నుంచి హరిణి దర్భా, భారత్ నుంచి మృదురవళి దర్భా, హంకాంగ్ నుంచి జయ పీసపాటి బృందంలో హర్షిణి పచ్చంటి, సుసర్ల సాయి జయంత్, నారాయణి గాయత్రి ఇయుణ్ణి, డా. సతీష్ కుమార్ పట్నాల, రోహన్ మార్కాపురం పాల్గొన్నారు. అమెరికా నుంచి రోహిత్ విస్సంశెట్టి, తైవాన్ నుంచి డాక్టర్ ఏకాంబర నెల్లూర్ ప్రకాష్, డాక్టర్ సత్య చందు హరిసోమయాజుల, కన్నెగంటి వాసంతి దేవి పలువురు గాయకులు పాల్గొన్నారు. వారంతా ఘంటసాల పాటలు పాడి , చక్కటి వ్యాఖ్యానంతో వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి బాలరెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ఈ అడ్రస్కు ghantasala100th@gmail.com వివరాలు పంపాలని కోరారు.
ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, వివరాలు మీ అందరి కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru