Esha Deol | బాలీవుడ్ నటులు ధర్మేంద్ర, హేమమాలిని గారాలపట్టి ఈశా దేవోల్. తల్లి నుంచి భరతనాట్యం, తండ్రి నుంచి నటన వారసత్వంగా పొందింది. భారీ అంచనాలతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమెకు మొదట్లో హిట్లు పలకరించినా తర్వాత విజయాలు ముఖం చాటేశాయి. పెండ్లి, పిల్లల బాధ్యతలతో గ్యాప్ తీసుకుంది. దాదాపు పదేండ్ల విరామం తర్వాత మళ్లీ తన అదృష్టం పరీక్షించుకుంటున్న ఈశా చెప్పిన ముచ్చట్లు ఇవి…
తల్లినయ్యాక సినిమాలకు విరామం ప్రకటించాను. అమ్మదనాన్ని పూర్తిగా ఆస్వాదించాలని ఈ నిర్ణయం తీసుకున్నా. నా ఇద్దరు కూతుళ్లు నాకు రెండు కండ్లు. వారి ఆలనాపాలనతో నేను కెరీర్కు దూరమయ్యానన్న సంగతే మర్చిపోయాను. అమ్మగా లభించే తృప్తి మరే పనిలోనూ దొరకదు.
అమ్మదనం ప్రతి మహిళకు బాధ్యతతో కూడిన వరం లాంటిది. చిన్నప్పటి నుంచి ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఉంటాం. కొన్ని మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని ప్రతికూలంగా మారుతాయి. కానీ, అమ్మగా మనం తీసుకునే నిర్ణయాలు కచ్చితత్వంతో ఉండాలి. అమ్మగా వంద శాతం ఆలోచించాలి. మా అమ్మ ప్రత్యేకించి సలహాలేం ఇవ్వదు. కానీ, ఆమె నాపట్ల ఎంత బాధ్యతతో ఉండేదో, నా పిల్లల విషయంలో నేనూ అలాగే ఉండాలని భావిస్తున్నాను.
ఇటీవల రుద్ర వెబ్సిరీస్తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాను. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అజయ్ దేవ్గణ్, సునీల్ శెట్టితో కలిసి పనిచేయడం గొప్పగా అనిపించింది. చాలా కాలం తర్వాత సెట్స్ మీదికి వెళ్లినప్పుడు నా పుట్టింటికి వచ్చానన్న ఫీలింగ్ కలిగింది.
నా కెరీర్ మొదట్లో విడుదలైన ధూమ్, యువ తదితర చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. నాకు ఉత్సాహాన్నిచ్చాయి. కొన్ని పరాజయాలు నా వేగానికి అడ్డుకట్ట వేశాయి. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్లు అయ్యారు. నేను సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. మంచి స్క్రిప్ట్ వచ్చి, నా పాత్ర నచ్చితే తప్పకుండా సినిమాల్లో నటిస్తాను.