న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లుకౌట్ నోటీస్ జారీ చేసింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. ఈ క్రమంలో ఇవాళ ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు జాక్వెలిన్ను అడ్డుకున్నారు. ఓ ప్రదర్శన కోసం ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయం నుంచి మస్కట్కు బయలుదేరనున్నారు. ఆమెను విచారణ కోసం ఢిల్లీకి తరలించనున్నారు.
ఆర్థిక నేరాల నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలులో ఉన్న సమయంలో ఓ వ్యాపారి భార్య నుంచి రూ.200 కోట్లు దోపిడీ చేసిన కేసులో.. ఈడీ సుకేశ్తో పాటు పలువురిపై ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. చంద్రశేఖర్, అతని భార్య లీనా మరియాపాల్పై దర్యాప్తు చేస్తున్న రూ.200 కోట్లకుపైగా మనీలాండరింగ్ కేసు సంబంధించిన కేసులో.. ఈడీ ఇప్పటికే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను పలుసార్లు విచారించింది. ఈ సందర్భంగా సుకేశ్ చంద్రశేఖర్, జాక్వెలిన్కు మధ్య ఆర్థిక లావాదేవిలు జరిగినట్లు ఆధారాలు గుర్తించింది.
సుకేష్, జాక్వెలిన్కు రూ.10కోట్ల విలువైన కానుకలు ఇచ్చాడని ఇందులో రూ.52లక్షల విలువైన గుర్రం, రూ.9లక్షల విలువైన పర్షియన్ పిల్లి సైతం ఉన్నట్లు ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. ఈ కేసులో ఈడీ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో బాలీవుడ్ నటిని మరోసారి విచారించనున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో నోరాఫతేహి పేరు సైతం ఉన్నది. అయితే నిందితుడితో ఎలాంటి వ్యక్తిగత సంబంధంపై వివరాలు తెలియలేదని, దీనిపై సైతం ఈడీ దర్యాప్తు చేస్తున్నది.