దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘సీతా రామం’. స్వప్న సినిమా పతాకంపై దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో భావోద్వేగాలు నిండిన ప్రేమ కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది.
తాజాగా ఈ చిత్రానికి పనిచేసిన అనుభవాలు తెలిపారు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ఆయన మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో మొత్తం 6 పాటలు వున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. ‘ఓహ్ సీత..’ పాట నాకు చాలా ఇష్టం. ఈ చిత్ర కథలో సంగీతానికి ఆస్కారం ఎక్కువ. మంచి సందర్భాలు కుదిరాయి.
కథ ఇచ్చిన స్ఫూర్తితోనే ఆకట్టుకునేలా స్వరాలు చేయగలిగాను. ‘కానున్న కళ్యాణం..’ పాట రాసిన సిరివెన్నెల గారు.. సాంగ్ కంపోజ్ చేసినప్పుడు స్టూడియోకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. కేకే, అనంత్ శ్రీరామ్లతో కూడా మంచి అనుబంధం వుంది.
సంగీతం విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. జర్మనీ, ఆమెరికా, ఫ్రాన్స్.. ఇలా విదేశీ వాయిద్యకారులతో పాటు దాదాపు 140మంది మ్యుజిషియన్స్తో నేపథ్య సంగీతాన్ని చేశాం. ఇలాంటి తరహాలో సంగీతాన్ని ఇప్పటిదాకా స్వరపర్చలేదు. 60, 80 దశకాలలో తెలుగు సినిమాలో ఎలాంటి రాగాలతో పాటలు వచ్చాయనే విషయంలో పరిశోధన చేశాను. మంచి సంగీతం ఇవ్వాలంటే సినిమాలో మంచి కంటెంట్ వుండాల్సిందే. త్వరలో హీరో మాధవన్ నటిస్తున్న సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నా’ అని అన్నారు.