‘మహానటి, సీతారామం’ ‘లక్కీ భాస్కర్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. దుల్కర్ సల్మాన్ 41వ చిత్రమిది. ‘డీక్యూ41’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవి నేలకుదిటి దర్శకత్వం వహిస్తారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్నివ్వగా, దర్శకుడు బుచ్చిబాబు సానా కెమెరా స్విఛాన్ చేశారు. చక్కటి ప్రేమకథతో పాటు హృదయాన్ని కదిలించే హ్యూమన్ డ్రామాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నామని, పాన్ ఇండియా రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అనయ్ ఓం గోస్వామి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, సహనిర్మాత: గోపీచంద్ ఇన్నమూరి, రచన-దర్శకత్వం: రవి నేలకుదిటి.