సినిమాలను బాయ్కాట్ చేయాలంటూ సోషల్మీడియాలో వ్యాప్తి అయ్యే ట్రెండ్స్ పట్ల కఠినంగా ఉండాలని, లేని పక్షంలో ఇండస్ట్రీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు బాలీవుడ్ హీరో అర్జున్కపూర్. ఇటీవల విడుదలైన అమీర్ఖాన్”లాల్సింగ్ చద్దా’, అక్షయ్కుమార్ ‘రక్షా బంధన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. విడుదలకు ముందు ఈ చిత్రాల్ని బాయ్కాట్ చేయాలంటూ సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ బాయ్కాట్ ట్రెండ్స్పై అమీర్ఖాన్, అక్షయ్కుమార్ స్పందించారు. వ్యక్తిగత అజెండాలతో సినిమాల్ని అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ విషయం గురించి అర్జున్ కపూర్ మాట్లాడుతూ ‘బాయ్కాట్ వార్తలపై మౌనం వహించడం ఏమాత్రం శ్రేయస్కరంకాదు. మన మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తారు.
ఇలాంటి దుష్ప్రచారాన్ని ఇప్పటికే ఎక్కువగా భరించాం. ఇక ఏమాత్రం ఉపేక్షించొద్దు. సోషల్మీడియా విషప్రచారాన్ని ప్రజలు నిజమని నమ్ముతున్నారు. అందుకే సినిమాలకు రావడం లేదు. చిత్రసీమ కలిసికట్టుగా ఈ తప్పుడు ప్రచారాలపై పోరాటం చేయాలి’ అని అర్జున్కపూర్ కోరారు.