దేశంలో ప్రతి ఒక్కరికి భావప్రకటన స్వేచ్ఛ ఉందని, అదే సమయంలో దేశాభివృద్ధికి ఉపకరించే అంశాల విషయంలో ప్రజలు సావధానంగా ఆలోచించాలని కోరారు బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘రక్షా బంధన్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రస్తుతం ఆయన సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాను బహిష్కరించాలనే పోస్ట్లు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై అక్షయ్కుమార్ స్పందిస్తూ.. ‘భారత్ ప్రపంచంలోనే గొప్ప దేశాల్లో ఒకటిగా ఆవిర్భవించేందుకు పరుగులు పెడుతున్నది.
ఇలాంటి తరుణంలో సినిమాల గురించి కూడా పాజిటివ్గా ఆలోచించాలి. సినిమా రంగం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు తన వంతు చేయూతనిస్తున్నదనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏవో చిన్న కారణాలతో సినిమాల్ని వివాదాల్లోకి లాగొద్దు’ అని అన్నారు.