ఈరోజుల్లో డబ్బింగ్ సినిమాల గురించి తెలియనివాళ్లు ఉండరు. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలోకి అనువదించడం మనం చూస్తూనే ఉన్నాం. అలా ఇతర భాషల్లో బ్లాక్బస్టర్గా నిలిచి తెలుగులోకి డబ్ అయిన సినిమాలకు బ్రహ్మరథం కూడా పడుతున్నారు. ఇటీవల కాలంలో రిలీజైన కేజీఎఫ్, మాస్టర్, ఆకాశం నీ హద్దురా!, ఖైదీ వంటి డబ్బింగ్ సినిమాలు మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇదంతా బాగానే ఉంది.. కానీ అసలు ఈ డబ్బింగ్ సినిమాల రాక తెలుగులో ఎప్పుడు మొదలైంది? ఏ భాష నుంచి తొలిసారి సినిమా డబ్బింగ్ అయిందన్న విషయాలు తెలుసా?
1931 నుంచి తెలుగులో టాకీ సినిమాలు వస్తున్నాయి. అంతకుముందు వరకు కేవలం మూకీ సినిమాలు నడిచేవి. కానీ తొలిసారిగా వెండితెరపై మాటలు వినిపించడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్సహాంగా ఫీలయ్యారు. టాలీవుడ్లో టాకీ సినిమాలు రావడం మొదలైన దాదాపు 19 ఏండ్లకు తెలుగు భాషలోకి ఒక సినిమా డబ్బింగ్ అయింది. 1950 జూన్ 22న తొలి డబ్బింగ్ సినిమా విడుదలైంది. ఆ సినిమా పేరే ఆహుతి. సంఘ క్షేమానికి బలైన ప్రేమికుల కథ దీనికి ఉపశీర్షిక. ఈ సినిమాను తెలుగు వారికి అందించింది నవీనా ఫిలింస్ నిర్మాణ సంస్థ. బాలీవుడ్లో 1946 జనవరి 1న విడుదలైన నీరా ఔర్ నందా సినిమానే ఆహుతి పేరిట డబ్ చేశారు. ఈ సినిమాలో జయసింహ, రూప్ బసంత్, శశి, నిశి, బరన్ తదితరులు నటించారు. ఆర్.ఎస్.జున్నాకర్ దర్శకత్వం వహించారు. హిందీలో ఈ సినిమాకు పి.శంకర్ సంగీతం అందించగా.. తెలుగు డబ్బింగ్కి సాలూరి రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చారు.
మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాతోనే మహాకవి శ్రీశ్రీ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు తనదైన శైలిలో మాటలు, పాటలు రాసి తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు శ్రీశ్రీ. మొత్తానికి ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో తెలుగులోకి డబ్బింగ్ చిత్రాలు రావడం మెల్ల మెల్లగా పెరిగింది. 1953లో ప్రేమలేఖలు, రోహిణి సహా పలు సినిమాలు హిందీ నుంచి డబ్ అయ్యాయి. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడ నుంచి కూడా సినిమాలు డబ్బింగ్ అవ్వడం మొదలైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
సీక్రెట్ ఏజెంట్స్గా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు
రేపటి నుంచే తెలంగాణలో సినిమా థియేటర్లు ఓపెన్