పుడమికి పచ్చలహారం అలంకరించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అపూర్వ కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఈ కార్యక్రమంలో ఎంతోమంది సినీతారలు పాల్గొంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా ‘డిజె టిల్లు’ జంట సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం ప్రశాసన్నగర్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. అనంతరం సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి మాట్లాడుతూ..‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యులను చేస్తున్న సంతోష్ గారికి కృతజ్ఞతలు. సిద్ధు ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక, మీనాక్షి చౌదరిలకు, నేహాశెట్టి దర్శకుడు విమల్ కృష్ణ, నిర్మాత నాగవంశీ, నటుడు ప్రిన్స్లకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ విసిరారు. యువతార ఆనంది కూడా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొన్నది. వరంగల్లోని ఇండియన్ హైస్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఆమె.. పర్యావరణ పరిరక్షణకు అంతా ముందుకు రావాలని కోరింది.