‘ఏపీ ప్రభుత్వంతో త్వరలో జరుపబోయే సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి సోమవారం అగ్రనటుడు చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ చర్చలకు వారికి ఆప్తులైన పది, పదిహేనుమంది మినహా ఇండస్ట్రీలోని ఎవరినీ పిలవలేదు.ఈ భేటీలో చిన్న సినిమాల నిర్మాతల్ని పూర్తిగా విస్మరించడం బాధాకరం’ అని అన్నారు నిర్మాత నట్టికుమార్. మంగళవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఫిలిం ఛాంబర్తో పాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్కు ఎలాంటి సమాచారం లేకుండా చిరంజీవిగారు సమావేశం నిర్వహించారు. ఎవరితో సంబంధం లేకుండా మీలో మీరు మాట్లాడుకోవడం తగదు. హీరో బాలకృష్ణను ఈ మీటింగ్కు ఎందుకు పిలవలేదో చెప్పాలి. చిరంజీవి పట్ల ఎంతో గౌరవం, నమ్మకం ఉన్నాయి. దాసరి నారాయణరావు తర్వాత ఆయన్నే నేను ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నా. కానీ చిరంజీవి ఇండస్ట్రీని విభజించి పాలించడం విచారకరం. టికెట్ రేట్లు ఇష్టానుసారం పెంచితే చిన్ననిర్మాతలు పూర్తిగా నాశనమవుతారు. తమ సొంత ప్రయోజనాల కోసమే ఈ సమావేశాన్ని నిర్వహించినట్లుగా అనిపిస్తోంది. ఇండస్ట్రీలోని అందరిని కలుపుకొనిపోవాలి’ అని అన్నారు.