మల్టీప్లెక్స్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సంటేజీ విధానంలో సినిమాల్ని ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని 23 సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల యజమానుల డిమాండ్ను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. దీనిని నిర్మాతల గిల్డ్ వ్యతిరేకించింది. థియేటర్లకు పర్సంటేజీ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల గిల్డ్ మధ్య వివాదం మరింత పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తమ నిర్ణయాన్ని కాదని నిర్మాతల గిల్డ్ స్పందించడంపై ఫిల్మ్ ఛాంబర్ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో పర్సంటేజీ విధానం అమలుపై ఈ నెల 30లోగా తుది నిర్ణయం తీసుకోవాలని, లేకుండా మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లను బంద్ చేసే ఆలోచనలో ఉన్నామని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ సంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని సినీ వర్గాల్లో ఆందోళన నెలకొన్నది.