Director Venu Udugula | బోలెడు ప్రతిభను తలలో పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చిన దర్శకుడు వేణు ఊడుగుల. తొలి సినిమా ‘నీది నాది ఓకే కథ’తో తన ప్రతిభ ఏ స్థాయిదో అందరికి తెలిజేశాడు. ప్రమోషన్లు అంతగా చేయకపోవడంతో ఈ సినిమా కమర్షియల్గా సేఫ్ కాలేకపోయింది. కానీ బోలెడన్ని ప్రశంసలు దక్కించుకుంది. ఎంతలా ఉంటే తన రెండో సినిమాకే సురేష్ ప్రొడక్షన్స్ నుండి కాల్ వచ్చేంతలా. ఇక సురేష్బాబు, చెరుకూరి సుధాకర్లతో కథ ఓకే చేయించుకుని రానా, సాయిపల్లవిలతో ‘విరాటపర్వం’ రూపొందించాడు.
టైటిల్ దగ్గర నుండి ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు. అయితే కారణాలేంటో తెలియదు ఈ సినిమా విడుదలకు మాత్రం ఒక యుద్ధమే జరిగింది. దానికి తోడు ఈ సినిమాను కరోనా మహమ్మారి అంటిపెట్టుకుని ఉంది. ఎలాగోలాగో మంచి తేది చూసి సురేష్బాబు ఈ సినిమాను రిలీజ్ చేశాడు. రిలీజ్కు ముందు ఏర్పడిన బజ్తో ఈ సినిమా మొదటి రోజు ఏదో లాగించేసింది. కానీ రెండవ రోజు నుండి ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు డివైడ్ టాక్, ట్రాజిక్ ఎండింగ్ ఉందని, కథనం మందగించిందని బోలెడన్ని నెగెటీవ్ రివ్యూలు. దాంతో వారం తిరిగేలోపే విరాటపర్వం అటకెక్కేసింది. బడ్జెట్లో పావువంతు కలెక్షన్లు కూడా సాధించలేక నిర్మాతలకు తీవ్ర నష్టాల్ని మిగిల్చింది.
ఇండస్ట్రీలో హిట్టు వచ్చిన దర్శకులకే మరో సినిమా ఒకే కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అలాంటిది డిజాస్టర్ ఇచ్చిన వేణు ఊడుగులకు అవకాశం రావడం కష్టమే అని అనుకున్నారు. కానీ వేణు ప్రతిభను ఒక్క డిజాస్టర్తో పోల్చలేమని సితార సంస్థ అవకాశం ఇచ్చిందని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థ ఎక్కువగా యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తుంది. ఇదే క్రమంలో వేణుకు కూడా ఓ అవకాశం ఇచ్చిందని టాక్. అయితే ఈ సారి మాత్రం వేణు సామాజిక అంశాలు, సందేశాల జోలికి పోకుండా పక్కా కమర్షియల్ స్క్రిప్ట్తో రెడీ అయ్యాడట.
అంతేకాదండోయ్! ఈ సారి ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ తీయబోతున్నాడట. ఒక మధ్య వయస్సుడికి, ఒక కుర్రాడికి మధ్య సాగే పోరు నేపథ్యంలో తెరకెక్కుతుందట. మధ్య వయస్సుడి పాత్రలో తమిళ హీరోను తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతుంది. కుర్రాడి పాత్రలో స్టార్ హీరో నటించనున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచన చేస్తున్నట్లు వినికిడి.