‘సినిమా అనేది ప్రేక్షకుల్ని ఆలోచింపజేయాలి, అలాంటి అర్థవంతమైన చిత్రాలే రూపొందిస్తా’ అంటున్నారు దర్శకుడు వేణు ఊడుగుల. ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారాయన. తాజాగా రానా, సాయి పల్లవి జంటగా ‘విరాటపర్వం’ అనే సినిమాను రూపొందించారు. 90 దశకపు కథతో నక్సలిజం నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ నెల 17న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు తెలిపారు దర్శకుడు వేణు ఊడుగుల.
మా సినిమా టీజర్కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కు కూడా అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. పాటలు ఆదరణ పొందుతున్నాయి. సినిమా విడుదల ఆలస్యమైనా కథ బాగుంటుందని, సినిమా వైవిధ్యంగా ఉంటుందనే అంచనాలు అలా ప్రజల మధ్య స్థిరంగా ఉండిపోయాయి. ఈ అంచనాలే రేపు థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తాయని ఆశిస్తున్నాం.
ఏ దర్శకుడికైనా తను చేసిన సినిమా త్వరగా విడుదల కావాలి, మరో కొత్త సినిమాకు వెళ్లిపోవాలని ఉంటుంది. కానీ లాక్డౌన్ వల్ల ఎవరూ ఏం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదు. ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ కావాలంటే మన సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు. సినిమా మీద మాకు చాలా నమ్మకం ఉంది.
వరంగల్ దగ్గర నర్సంపేట మాది. నేను పుట్టి పెరిగిన వాతావరణం, చూసిన ఘటనలు, అప్పటి సామాజిక పరిస్థితులు దర్శకుడిగా నేను ఎలాంటి సినిమాలు చేయాలో నేర్పించాయి. నాకొక ఖచ్చితమైన దృక్ఫథాన్ని ఇచ్చాయి. చరిత్ర దాచిన కథలు, దాచబడిన కథలు ప్రేక్షకులకు చూపించాలని అనుకుంటున్నా. ఆ ఆలోచనల నుంచి రాసుకున్న కథే ఇది. ఎవరికి చెప్పినా పది నిమిషాల్లో ఒప్పుకునే శక్తి ఈ కథకు ఉంది. రానా, సురేష్ బాబు, నిర్మాత సుధాకర్ చెరుకూరి, సాయి పల్లవి ఇలా అందరూ ఒకే సిట్టింగ్లో కథను ఓకే చేశారు. మహాభారత విరాటపర్వంలో రాజకీయంగా ఎన్ని కుట్రలు జరగాలో అన్ని జరుగుతుంటాయి. టైటిల్ మా కథను ప్రతిబింబిస్తుంది. నేను చూసిన సరళ అనే ఒక యువతి జీవితంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాను. అయితే ఇందులో కల్పిత సన్నివేశాలు, సినిమాకు కావాల్సిన అంశాలు చేర్చాం.
ఈ సినిమాలో నక్సలిజం గురించి ప్రచారం చేయడం లేదు. కొత్త నేపథ్యంతో ఒక ప్రేమ కథను చూపిస్తున్నాం. 90 దశకంలోని రాజకీయ సందర్భం ఒక అమ్మాయి ప్రేమ మీద ఎలాంటి ప్రభావం చూపించింది అనేది చెబుతున్నాం. 1992 సంవత్సరంలో కథ మొదలవుతుంది. అప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేశారు. ఏక్తా యాత్ర దేశమంతా జరుగుతుండేది. దానికి కౌంటర్గా లెఫ్ట్ పార్టీల ఉద్యమాలు, మద్యపాన నిషేధం ఆందోళనలు ఉండేవి. మరోవైపు పోలీసులు, నక్సలైట్స్ మధ్య యుద్ధం జరుగుతుండేది. ఆ సంఘర్షణ అంతా సినిమా నేపథ్యంగా సాగుతుంది. ప్రధానంగా మాత్రం వెన్నెల కథే ఉంటుంది. నక్సలిజం అనేది ఇందులో ఒక ఉత్ప్రేరకం మాత్రమే. కథ ఎటు వెళ్లాలి ఎందుకు వెళ్లాలని నిర్ణయిస్తుంది. కథలో మానవ సంబంధాలు, భావోద్వేగాలు ఉంటే ఏ నేపథ్యంతో సినిమా తెరక్కెకించినా ప్రేక్షకులకు నచ్చుతుంది. చూసిన వారికి రోజుల పాటు ఈ సినిమా గుర్తుండిపోతుంది.
మనుషుల మధ్య ఉండే ప్రేమ వేరు, సమాజానికి, మనిషికి మధ్య ఉండే ప్రేమ వేరు. వ్యక్తిగత ప్రేమ కంటే, సమాజం కోసం చూపించే ప్రేమ గొప్పది. కుటుంబాన్ని, మనకున్న సర్వస్వం వదిలేసి ప్రజల కోసం పోరాడాలంటే ఎంత ప్రేమ ఉండాలి. ఎంత త్యాగం చేయగలగాలి. ఆ త్యాగాన్ని హీరో పాత్రలో చూస్తారు.
90ల వాతావరణం క్రియేట్ చేయడం కోసం మారుమూల ప్రాంతాలకు వెళ్లి షూటింగ్ చేశాం. అయినా అక్కడ సెల్ టవర్స్, మొబైల్లో మాట్లాడేవాళ్లు కనిపిస్తూనే ఉండేవారు. వాటిని కంప్యూటర్ గ్రాఫిక్స్లో లేకుండా చేశాం. ఈ శ్రమంతా మా నిర్మాతలు తీసుకున్నారు. రెండు చిత్రాలకు పడిన కష్టం ఈ ఒక్కదానికే పడ్డారు.
నేను కథ రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ పాత్రకు సాయి పల్లవి అయితేనే కరెక్ట్ అనిపించింది. మా దగ్గర జమ్మికుంట అనే ఊరు ఉంది. ఆ రైల్వే స్టేషన్ పక్కనుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం నా మనసులో ముద్రించుకుపోయింది. సాయి పల్లవి ఆ అమ్మాయిలాగే అనిపించింది. ఆమెను కలిసి పది నిమిషాలు కథ చెప్పాను. వెంటనే ఈ సినిమా చేస్తానని ఒప్పుకుంది.
నా చిన్నతనంలో నక్సల్ మూవ్మెంట్ బాగా ఉండేది, అస్తిత్వ ఉద్యమాలు జరిగేవి. ఇలాంటి సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో నేను పెరిగాను. దేశానికి తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాలగా ఉండేది. ఇక్కడ జరిగే రాజకీయాలు దేశాన్ని ప్రభావితం చేసేవి. ఇలాంటివన్నీ చూసిన నాలో సహజంగానే అభ్యుదయ భావాలు ఏర్పడ్డాయి. నేను రాసే సాహిత్యం, రూపొందించే చిత్రాల్లోనూ ఆ భావాల ప్రభావం కనిపిస్తుంటుంది. ఇవాళ ప్రతి ప్రేక్షకుడిలో సినిమా పరిజ్ఞానం పెరిగింది. ఏదో ఒక సినిమా చేసి ఇది పక్కా కమర్షియల్గా ఉంటుంది అంటే నమ్మే పరిస్థితి లేదు. అలాగే ఆర్ట్ ఫిలిం అన్నా ఒప్పుకోరు. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఆదరిస్తారు. అది ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉంది. నా కథల్లో కంటెంట్ ఉంది కాబట్టే ఇంత బడ్జెట్తో నిర్మిస్తున్నారు. భవిష్యత్లోనూ అర్థవంతమైన చిత్రాలే రూపొందిస్తాను.
లాక్డౌన్ సమయంలో రెండు స్క్రిప్టులు సిద్ధం చేసుకున్నా. అవి ఏ హీరోతో చేస్తున్నా అనేది త్వరలో చెబుతాను. చలం రాసిన ‘మైదానం’ అనే రచన ఆధారంగా ఓ సినిమాను ఆహా ఓటీటీ కోసం చేస్తున్నాం. దానికి నేను షో రన్నర్గా వ్యవహరిస్తాను.
వెన్నెల అనే పాత్రలో సాయిపల్లవికి అంత ప్రాధాన్యత ఇవ్వగలిగాం అంటే అది రానా గొప్పతనం. ఆయన ఈ చిత్రానికి నిర్మాత కూడా. కథలో ఆమెకున్న ప్రాముఖ్యతను బట్టి అర్థం చేసుకున్నారు. రేపు సాయి పల్లవికి పేరొస్తే అది రానా గొప్పతనమే అనుకోవాలి. రానా పాత్రలోనూ హీరోయిజం ఉంటుంది. కామ్రేడ్ రవన్న పాత్రలో రానా నటన ఆకట్టుకుంటుంది. రానా ఉన్నాడు కాబట్టి పాన్ ఇండియా కూడా ప్లాన్ చేయొచ్చు. అయితే జూలై 1న అనుకున్న మా సినిమా ఈ నెల 17నే రిలీజ్ అవుతున్నది. దాంతో వేరే భాషల్లోకి తీసుకెళ్లే టైమ్ లేదు. అయితే ఆ ప్లాన్స్లో నిర్మాతలు ఉన్నారు.