‘జై భీమ్’ చిత్రం చక్కటి సామాజిక సందేశంతో అగ్ర హీరో సూర్య కెరీర్లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదికలో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో మరో సినిమాకు రంగం సిద్ధమైంది. అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఈ సినిమా సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ ‘సూర్య హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో మరో సినిమాకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. ప్రేక్షకుల హృదయాల్ని స్పృశించే అర్థవంతమైన కథ ఇది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నది. సాయి అభ్యంకర్ సంగీతాన్నందిస్తున్నారు.